AP Assembly Session: ఆగస్టు 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులతో ప్రభుత్వం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. ఇటీవల జారీ చేసిన ఐదు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లోనే సభ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలను ఎజెండాలో చేర్చాలనే విషయాలపై ఆగస్టు 17న జరగనున్న శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వివరాలు
ఆర్డినెన్స్ బిల్లులు, అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్
ఈ సమావేశాల్లో జిల్లాల వారీ అభివృద్ధి, ప్రాంతాల మధ్య సమతుల అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, అమరావతి అభివృద్ధి, గత వైకాపా ప్రభుత్వ పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి వంటి అంశాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది.
అదేవిధంగా పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణ, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అమలు, విద్యుత్ ఛార్జీల నియంత్రణ, విద్యుత్ రంగంలో పెట్టుబడులు, భూ సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, నౌకాశ్రయాల అభివృద్ధి, భోగాపురం విమానాశ్రయం సహా పలు కీలక అంశాలను కూడా సభలో చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది.