Loading...
Andhra Pradesh: ఎస్‌ఐఆర్‌ పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ.. హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదిక
ఎస్‌ఐఆర్‌ పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ.. హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదిక

Andhra Pradesh: ఎస్‌ఐఆర్‌ పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ.. హైకోర్టుకు ఎస్‌ఈసీ నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా పరిస్థితులపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను స్పష్టంగా తమ ముందుంచాలని పేర్కొంటూ తదుపరి విచారణను అక్టోబర్‌ 6కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ

విచారణ సందర్భంగా ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కొనసాగుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ ప్రక్రియ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆధ్వర్యంలో జరుగుతున్నందున ఓటర్ల జాబితాలపై ప్రస్తుతం ఎస్‌ఈసీకి ప్రత్యక్ష నియంత్రణ లేదని తెలిపారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా అందిన తర్వాతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన తదుపరి చర్యలు చేపడతామని వివరించారు.

ఎస్‌ఈసీ వాదనలను నమోదు చేసిన ధర్మాసనం, స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. అనంతరం విచారణను అక్టోబర్‌ 6కు వాయిదా వేసింది.

వివరాలు 

రెండు ప్రజాహిత వ్యాజ్యాలు

ఈ వ్యవహారానికి సంబంధించి రెండు ప్రజాహిత వ్యాజ్యాలు (పిల్‌లు) హైకోర్టులో విచారణకు వచ్చాయి.

ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన పిల్‌లో, బీసీ జనగణన చేపట్టకుండానే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పేర్కొన్నారు.

బీసీ జనాభాను శాస్త్రీయంగా లెక్కించి, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోర్టును కోరారు.

మరోవైపు న్యాయవాది తాండవ యోగేష్‌ దాఖలు చేసిన పిల్‌లో, రాష్ట్రంలోని 13,325 గ్రామపంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీకాలం ఇప్పటికే ముగిసిందని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆలస్యం చేయకుండా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల నిర్ణయం 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ, సామాజిక స్థితిగతులపై ప్రభుత్వం చేపట్టిన సర్వే పూర్తయిందని తెలిపారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ త్వరలోనే తన నివేదిక సమర్పించనున్నదని చెప్పారు.

ఆ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు నిర్ణయిస్తామని కోర్టుకు వివరించారు.

అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కొనసాగుతోందని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

ADVERTISEMENT

వివరాలు 

హైకోర్టుకు మరో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల నియామకం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు మరో ముగ్గురు న్యాయవాదులను ప్రభుత్వ న్యాయవాదులుగా (జీపీలు) నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన జీపీలలో ఎస్వీ రమణ, కె. పల్లవి, టీవీపీ సాయి విహారి ఉన్నారు.

ADVERTISEMENT