Hyderabad: సూపర్ అలాయ్ల దిగుమతులకు ప్రత్యామ్నాయం.. ఏఆర్సీఐ కొత్త ద్విలోహ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
వైమానిక, అణుశక్తి, థర్మల్ పవర్ ప్లాంట్లు వంటి కీలక పరిశ్రమల్లో వినియోగించే ఖరీదైన సూపర్ అలాయ్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా హైదరాబాద్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అత్యాధునిక ద్విలోహ (బైమెటాలిక్) నిర్మాణాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఈ ఘనతను హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ) శాస్త్రవేత్తలు సాధించారు. గ్యాస్ టర్బైన్లు, అణు రియాక్టర్లు, థర్మల్ పవర్ ప్లాంట్లలోని కొన్ని భాగాలు దాదాపు 2 వేల డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటాయి. అదే సమయంలో వాటి సమీపంలోని మరికొన్ని భాగాలు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తుంటాయి.
వివరాలు
రెండు లోహాలను ఒకే భాగంగా తయారు చేయగలిగితే..
తక్కువ ఉష్ణోగ్రతల్లో స్టెయిన్లెస్ స్టీల్ (ఎస్ఎస్316ఎల్) అత్యుత్తమ బలం ప్రదర్శిస్తే, అత్యధిక వేడిని నికెల్ ఆధారిత ఇన్కోనెల్ సూపర్ అలాయ్ (ఐఎన్718) సమర్థంగా తట్టుకోగలదు.
ఈ రెండు లోహాలను ఒకే భాగంగా తయారు చేయగలిగితే పనితీరు మరింత మెరుగవడంతో పాటు పరికరాల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
అయితే ఎస్ఎస్316ఎల్,ఐఎన్718 వంటి రెండు విభిన్న లోహాలను ఒకే నిర్మాణంలో కలపడం అంత సులభం కాదు. తయారీ సమయంలో పగుళ్లు ఏర్పడటం,రంధ్రాలు రావడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతుంటాయి.
ఈ సవాల్ను అధిగమించేందుకు ఏఆర్సీఐకి చెందిన ఎస్. నారాయణస్వామి, గురురాజ్, నోకున్ పార్క్, రవి బాతేలతో కూడిన పరిశోధక బృందం లేజర్ బేస్డ్ పౌడర్ బెడ్ ఫ్యూజన్ అనే ఆధునిక అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ విధానాన్ని వినియోగించింది.
వివరాలు
అత్యంత దృఢమైన, నాణ్యమైన ద్విలోహ నిర్మాణం
ఈ సాంకేతికత సహాయంతో ఎలాంటి పగుళ్లు లేదా రంధ్రాలు లేకుండా అత్యంత దృఢమైన, నాణ్యమైన ద్విలోహ నిర్మాణాన్ని రూపొందించడంలో పరిశోధకులు విజయాన్ని సాధించారు.
ఈ ఆవిష్కరణతో భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే కీలక పారిశ్రామిక పరికరాల తయారీలో స్వదేశీ సాంకేతికతకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.
అలాగే ఖరీదైన సూపర్ అలాయ్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు దేశీయ తయారీ రంగానికి కూడా ఇది గణనీయమైన ఊతం అందించనుంది.