Kejriwal: కేజ్రీవాల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు.. మెటాపై తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఈ విషయంపై మెటా ఇండియా కార్యాలయాన్ని పలుమార్లు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించిన కేజ్రీవాల్, తన ఖాతాపై పరిమితులు కేవలం భారత్లోనే అమల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై ఎన్నిసార్లు మెటాకు ఈ-మెయిల్స్ పంపినా ఎలాంటి స్పందన రాలేదని, ఖాతాపై విధించిన ఆంక్షలను ఎలా తొలగించాలో కూడా ఎవరూ వివరించడం లేదని ఆయన విమర్శించారు. మెటా అందిస్తున్న సేవలు అత్యంత నిరాశాజనకంగా ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ముందు మెటా తలవంచిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
వివరాలు
ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయని మెటా
ఈ20 పెట్రోల్ వివాదానికి సంబంధించిన తన పోస్టుల వ్యాప్తిని నియంత్రించేందుకే మెటా ఇలాంటి చర్యలకు దిగిందని కూడా ఆయన ఆరోపించారు.
అయితే కేజ్రీవాల్ చేసిన ఈ ఆరోపణలపై మెటా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇదిలా ఉండగా, గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను కొద్దిసేపు తొలగించిన ఘటనపై మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే.