Centre Issues Advisory: హోర్ముజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయ నావికులను పంపొద్దు: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను విధులకు పంపొద్దని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఈ మేరకు భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (డీజీఎంఏ) నౌక యజమానులు, నిర్వహణ సంస్థలు, సీఫేరర్ల నియామక ఏజెన్సీలకు ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని,ఇటీవల భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతో పాటు వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని డీజీఎంఏ పేర్కొంది. భారతీయ నావికుల భద్రత,సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
వివరాలు
కెప్టెన్లు మరింత అప్రమత్తంగా ఉండాలి: డీజీఎంఏ
ఇటీవల మోంబాసా బీ,అల్ బహ్యా,జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంఎటి వెడియాన్, అల్ రేకయ్యత్ వంటి వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పర్షియన్ గల్ఫ్,హోర్ముజ్ జలసంధి, పరిసర సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న నౌకల కెప్టెన్లు మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీఎంఏ సూచించింది.
నావిగేషన్ హెచ్చరికలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అంతర్జాతీయ షిప్ అండ్ పోర్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ (ఐఎస్పీఎస్) కోడ్ ప్రకారం అన్ని భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
వివరాలు
3.10 లక్షల మంది భారతీయ నావికులు
భద్రతా ఆందోళనల కారణంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి తమ దేశ నావికులను పంపొద్దని ఫిలిప్పీన్స్ ఇప్పటికే ఇలాంటి మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇప్పుడు భారత్ కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకల్లో సుమారు 3.10 లక్షల మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారు.
ఈ సంఖ్యతో ప్రపంచంలోనే అత్యధిక సీఫేరర్లను అందిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పర్షియన్ గల్ఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక సూచనలు జారీ చేసిన కేంద్రం
Advisory for Indian Maritime Stakeholders
— Directorate General of Shipping, Govt. of India (@dgshipping_IN) July 15, 2026
In view of the heightened security situation in the Gulf region, the Directorate General of Maritime Administration (DGMA), through DGMA Circular No. 36 of 2026, has directed Ship Owners, Ship Managers and RPSL Companies to avoid… pic.twitter.com/s8XgKI1ifn