Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. కొత్త విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య నగరానికి కేవలం 15 కి.మీ.ల దూరంలో ఉంటుంది. విమానాశ్రయం టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఏటా 10 లక్షల మంది ప్రయాణీకులకు సేవలను అందించేలా దీన్ని నిర్మించారు. అయోధ్య ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్లో ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్ఈడీ లైటింగ్, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్లతో ల్యాండ్స్కేపింగ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
రూ. 1462.97 కోట్ల వ్యయంతో విమానాశ్రయం నిర్మాణం
రూ. 1462.97 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యాధునిక విమానాశ్రయం రాముడి జీవిత ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ప్రయాణీకులకు సాంస్కృతికంగా గొప్ప స్వాగతాన్ని అందజేస్తూ, పవిత్ర గ్రంథాలతో వివరించబడిన 'నగర శైలి'ని అనుసరించే విశిష్ట నిర్మాణం దీని సొంతం. విమానాశ్రయంలోని వివిధ స్థాయిలలో శ్రీరాముని వర్ణనలు ఉన్నాయని యూపీ ప్రభుత్వం పేర్కొంది. అయోధ్య విమానాశ్రయం రన్ వేను కూడా అన్ని రకాల విమానాలను నడిచేలా అత్యాధునికంగా నిర్మించారు. ఈ విమానాశ్రయం నుంచి దిల్లీకి ఇండిగో విమానం తొలిసారి ప్రయాణించే అకాశం ఉందని తెలుస్తోంది. విమానాశ్రయం వెలుపల, విల్లు, బాణంతో కూడిన కుడ్యచిత్రం ఏర్పాటు చేశారు. విమానాశ్రయం ప్రధాన భవనంలో 7 స్తంభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి రామాయణంలోని ముఖ్యమైన ఎపిసోడ్లను సూచించేలా నిర్మించారు.