Bengaluru: డెలివరీ బాయ్స్కు కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. రూల్స్ బ్రేక్ చేస్తే నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లోనే.. ఎక్కడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో యాప్ ఆధారిత ఫుడ్,ఈ-కామర్స్ డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన డెలివరీ రైడర్లకు జరిమానా విధించే బదులుగా, సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్కు హాజరుకావడం తప్పనిసరి చేశారు. ఈ సమయంలో వారు డెలివరీలు చేయలేకపోవడంతో ఆదాయాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. నగరంలో యాప్ ఆధారిత డెలివరీ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలు తరచూ ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో అవగాహన కల్పించేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నగరంలోని 53 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వివరాలు
మూడు రోజుల్లో 4,000 మంది గిగ్ వర్కర్లపై ట్రాఫిక్ కేసులు నమోదు
గత మూడు రోజుల్లోనే సుమారు 4,000 మంది గిగ్ వర్కర్లపై ట్రాఫిక్ కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి తెలిపారు.
చాలామంది గిగ్ వర్కర్లు చిన్న పట్టణాలు,గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని,ట్రాఫిక్ నిబంధనలపై సరైన అవగాహన లేకుండానే వాహనాలు నడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కేవలం జరిమానాలు విధించడం కంటే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
అధికారుల ప్రకారం,ప్రస్తుతం ఈ ఉల్లంఘనలకు నగదు జరిమానాలు విధించడం లేదు.
అయితే నాలుగు గంటల కౌన్సెలింగ్కు హాజరుకావడం తప్పనిసరి. దీంతో ఆ సమయంలో డెలివరీలు చేయలేక గిగ్ వర్కర్లు తమ రోజువారీ ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది.
వివరాలు
10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ పూర్తి చేయాల్సిన ఒత్తిడి
ఇటీవలి కాలంలో 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ పూర్తి చేయాల్సిన ఒత్తిడి కారణంగా అనేక మంది డెలివరీ రైడర్లు ప్రమాదకరంగా వాహనాలు నడుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు.
త్వరగా గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో వన్వేలో వ్యతిరేక దిశలో వెళ్లడం, సిగ్నల్స్ దాటేయడం, ఫుట్పాత్లపై వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
బెంగళూరులో గిగ్ వర్కర్లలో చాలామంది 'యులు (Yulu)' వంటి అద్దెకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందించే సంస్థల వాహనాలను ఉపయోగిస్తున్నారు.
గంటకు 25 కిలోమీటర్లలోపు గరిష్ఠ వేగం, 250 వాట్లలోపు మోటార్ సామర్థ్యం ఉన్న ఈ వాహనాలకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం వల్ల నియంత్రణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
వివరాలు
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
ఫుడ్ డెలివరీ కంపెనీలు తమ రైడర్లకు సురక్షిత మార్గాలను సూచించాలని కోరినా, ఏ మార్గంలో వెళ్లాలన్నది రైడర్ల నిర్ణయమేనని సంస్థలు సమాధానం ఇచ్చినట్లు కార్తీక్ రెడ్డి వెల్లడించారు.
అదే సమయంలో ఈ-బైక్లను అందిస్తున్న సంస్థలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా రైడర్లను పర్యవేక్షించే బాధ్యత తమది కాదని, అది యాప్ ఆధారిత డెలివరీ కంపెనీలదేనని స్పష్టం చేశాయి.
చాలా వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోవడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడం కూడా కష్టంగా మారిందన్నారు.
అయితే గంటకు 25 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రిజిస్ట్రేషన్, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.
వివరాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించే రైడర్లకు ప్రోత్సాహకాలు
2024లో జరిగిన సమావేశంలో ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, షాడోఫ్యాక్స్, పోర్టర్, బిగ్బాస్కెట్, యులు బైక్స్ వంటి సంస్థల ప్రతినిధులతో ట్రాఫిక్ పోలీసులు సమావేశమై, ట్రాఫిక్ నిబంధనలు పాటించే రైడర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు.
అయితే ఇప్పటివరకు ఆ ప్రతిపాదన అమలులోకి రాలేదని తెలిపారు.
గిగ్ వర్కర్లు ఎక్కువగా చేసే ట్రాఫిక్ ఉల్లంఘనల్లో వన్వేలో వ్యతిరేక దిశలో ప్రయాణించడం, ఫుట్పాత్లపై వాహనాలు నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దాటేయడం, నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలపడం, ఫుట్పాత్లపై పార్కింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రధానంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
వివరాలు
పూర్తిస్థాయిలో అమలులోకి రాని BMLTA చట్టం
బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ కూడా తక్కువ వేగం గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు తరచూ రాంగ్ సైడ్లో నడవడం,ఫుట్పాత్లపై ప్రయాణించడం,అక్రమంగా పార్క్ చేయడం తీవ్రమైన సమస్యగా మారిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇవి మోటార్ వెహికిల్స్ చట్టపరిధికి పూర్తిగా రాకపోవడంతో,నియంత్రణలోకి తీసుకురావాలని రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(BMLTA)చట్టంలో యాప్ ఆధారిత మొబిలిటీ సేవల నియంత్రణకు నిబంధనలు ఉన్నప్పటికీ,అవి ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదన్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మాత్రమే బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అన్ని రకాల వాహనాలపై 6,66,562సిగ్నల్ జంపింగ్ కేసులు,7,62,165రాంగ్ పార్కింగ్ కేసులు,2,59,470నో-ఎంట్రీ ఉల్లంఘన కేసులు నమోదు చేయడం నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతను సూచిస్తోంది.