Aravind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గోవా కోర్టులో ఊరట
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు గోవా కోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను గోవా కోర్టు రిజెక్ట్ చేసింది. 2017లో గోవా ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై గోవాలో కేసు నమోదైంది. ఆ ఎన్నికల ప్రచారంలో 'డబ్బులు ఇస్తే అందరి దగ్గరా తీసుకోండి కానీ, ఓటు మాత్రం చీపురుకే వేయండి' అని పిలుపునిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలపట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ప్రసంగానికి సంబంధించి గోవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది
ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఐపీసీ 171 ప్రకారం గోవా పోలీసులు అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదు చేశారు. దీనిపై జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కేజ్రీవాల్ కు సమన్లు పంపింది. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లకు పరిమితమైంది. దాదాపు ఏడేళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను చెల్లదంటూ గోవా కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కేజ్రీవాల్ కు కొంత ఊరట లభించినట్లైంది.