FDA: ఎఫ్డీఏ తీరుపై బాంబే హైకోర్టు ఫైర్.. ఐదు హోటళ్ల లైసెన్సులపై కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారుల తీరుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) ప్రాంగణంలో పనిచేస్తున్న ఐదు హోటళ్ల లైసెన్సులను రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. ఆహార భద్రతా నిబంధనలను 88 శాతం మాత్రమే పాటిస్తున్నాయనే కారణంతో వాటిని సీజ్ చేయడం సరైన చర్య కాదని కోర్టు పేర్కొంది. ఎఫ్డీఏ అధికారులు ఎప్పుడూ ఎందుకు ఇంత తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. 'మీరేమైనా ప్రభువులమని.. ఏమైనా చేయగలమని అనుకుంటున్నారా?' అంటూ మండిపడింది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు వ్యవహరించాలని సూచించింది.
వివరాలు
పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు సూచనలు చేసినప్పటికీ ఎఫ్డీఏ అధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్లతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
దీంతో ఐదు ఆహారశాలల (Eateries) లైసెన్సులను నిలిపివేస్తూ ఎఫ్డీఏ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.
ఇటీవల ఎఫ్డీఏ అధికారులు ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 88 శాతం ఆహార పదార్థాలు ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
ఎఫ్డీఏ అధికారుల తీరుపై అసహనం
అయితే హోటళ్ల నిర్వహణలో అపరిశుభ్రత, మూడో పక్షం కార్యకలాపాలు వంటి అవకతవకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
దీంతో వాటి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ చర్యలను సవాల్ చేస్తూ ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఎఫ్డీఏ అధికారుల తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.