Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు బూస్ట్.. పది కొత్త రైళ్ల కొనుగోలుకు ప్రతిపాదనలు
ఈ వార్తాకథనం ఏంటి
మెట్రోరైలును ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్ల కొనుగోలుపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) దృష్టి సారించింది. ఈ క్రమంలో పది కొత్త మెట్రో రైళ్ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం నగరంలో మూడు కోచ్లతో కూడిన మెట్రో రైళ్లు మాత్రమే నడుస్తుండగా, కొత్తగా కొనుగోలు చేయాలని ప్రతిపాదించినవి ఆరు కోచ్ల రైళ్లు కావడం గమనార్హం. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే కొనుగోళ్ల కోసం టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.
Details
రద్దీ వేళల్లో ఊరట
ఆరు కోచ్లతో కూడిన కొత్త మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే, పీక్ అవర్స్లో ప్రయాణికుల రద్దీని సమర్థంగా ఎదుర్కొనవచ్చని అధికారులు భావిస్తున్నారు. మెట్రో స్వాధీన ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూడకుండా, ప్రభుత్వం అనుమతిస్తే ముందుగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని హెచ్ఎంఆర్ఎల్ యోచిస్తోంది.
Details
స్వాధీన ప్రక్రియ ప్రస్తుత స్థితి
మెట్రో యాజమాన్య బదిలీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఐడీబీఐ క్యాపిటల్ను ఆర్థిక సలహాదారుగా నియమించారు. ఈ సంస్థ ప్రస్తుతం మదింపు ప్రక్రియను నిర్వహిస్తోంది. మరో వారం రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదనంగా, సాంకేతిక అంశాల పరిశీలన కోసం మరో కమిటీని నియమించే పనిలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఉన్నట్లు వెల్లడైంది.