BRICS Summit 2026: భారత్ నేతృత్వంలో సరికొత్త వ్యూహాత్మక అజెండా..
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈసారి సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తోంది. "బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ" (BRICS)ను ప్రధాన ఇతివృత్తంగా భారత్ ఎంచుకుంది. దీనికి అనుబంధంగా "హ్యూమానిటీ ఫస్ట్" (మానవత్వమే ప్రథమం) అనే దృక్పథంతో తన ప్రాధాన్యాలను ప్రకటించింది.
vivaralu
భారత్ డిజిటల్ అనుభవాలకు ప్రాధాన్యం
యూపీఐ (UPI), ఆధార్ వంటి భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) అనుభవాలను బ్రిక్స్ సభ్య దేశాలతో పంచుకునేందుకు 'BRICS DPI రిపాజిటరీ'ని ఏర్పాటు చేయనున్నారు.
కృత్రిమ మేధ (AI), ఫిన్టెక్ వంటి ఆధునిక సాంకేతికతలను గ్లోబల్ సౌత్లోని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటులోకి తీసుకెళ్లడంపైనా దృష్టి పెట్టనున్నారు.
వ్యవసాయ రంగంలోనూ ఏఐ, జియోస్పేషియల్ టూల్స్ వినియోగాన్ని పెంచి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 'BRICS డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్'ను విస్తరించే ప్రతిపాదన ఉంది.
సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా రైతులకు ఉపయోగకరమైన పరిష్కారాలను అందించడమే దీని ఉద్దేశం.
vivaralu
వాణిజ్యం,MSMEలకు ఊతం.. స్థానిక కరెన్సీలకు ప్రాధాన్యం
ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్లో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యాన్ని పెంచడం భారత్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.
అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను బలోపేతం చేయడంపై సభ్య దేశాలతో చర్చించనుంది.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) సులభంగా రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం పొందేలా 'BRICS MSME కోఆపరేషన్ పోర్టల్'ను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ విధానాలను అమలు చేయాలని భారత్ ప్రతిపాదిస్తోంది.
vivaralu
యువతలో ఆవిష్కరణలకు ప్రోత్సాహం
యువతలోని కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 'బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్', 'స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్' ఏర్పాటు చేసే అంశంపై సదస్సులో చర్చలు జరగనున్నాయి.
అలాగే 'BRICS యూత్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ 2026' ద్వారా విద్యార్థులు, పరిశోధకుల మధ్య పరస్పర మార్పిడి కార్యక్రమాలను మరింత విస్తరించనున్నారు.
హరిత ఇంధనం, స్మార్ట్ గ్రిడ్లపై దృష్టి
గ్రీన్ ఫైనాన్స్, స్మార్ట్ గ్రిడ్లు, హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, కార్బన్ క్యాప్చర్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టనున్నారు.
గుర్గావ్లో జరిగిన ఇంధన మంత్రుల సమావేశంలో వచ్చిన అంశాల ఆధారంగా 'BRICS డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్మార్ట్ గ్రిడ్స్' ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
vivaralu
11 దేశాలతో మరింత బలమైన బ్రిక్స్
ప్రస్తుతం 11 సభ్య దేశాలతో బ్రిక్స్ మరింత విస్తృతంగా మారింది. భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేషియా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి (UN), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో తక్షణ సంస్కరణలు చేపట్టాలని బ్రిక్స్ దేశాలు మరింత బలంగా డిమాండ్ చేయనున్నాయి.
ప్రపంచ పాలనా వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరింత ప్రాతినిధ్యం, ప్రాధాన్యం కల్పించాలన్న అంశం కూడా కీలకంగా మారనుంది.