Loading...
Delhi: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంక్షలు
నేటి నుంచి మూడు రోజులపాటు ఆంక్షలు

Delhi: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

8వ అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ దేశాల అగ్రనేతలతో పాటు విదేశీ ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో దిల్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, రాకపోకల పరంగా కేంద్రం, ఢిల్లీ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మార్గమళ్లింపులు అమల్లో ఉండనున్నాయి.

వివరాలు 

పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు

శనివారం నుంచి బ్రిక్స్ సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం నుంచే పలు కీలక నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి.

ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలకు సెప్టెంబర్ 11న సెలవు ప్రకటించారు.

అదే విధంగా ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆ రోజు పనిచేయవు.

వారాంతపు సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి సాధారణంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

వివరాలు 

యథావిధిగా మెట్రో సేవలు

బ్రిక్స్ సదస్సు కారణంగా ఢిల్లీ మెట్రో రైలు సేవలను పూర్తిగా నిలిపివేయడం లేదు. నగరవ్యాప్తంగా మెట్రో రైళ్లు సాధారణంగానే నడవనున్నాయి.

అయితే సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్‌లో ఉన్న ఢిల్లీ మెట్రో మ్యూజియాన్ని సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూసివేయనున్నారు.

సదస్సు నేపథ్యంలో నగరంలోని 35కుపైగా ప్రధాన రహదారులపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వీవీఐపీలు, విదేశీ ప్రముఖుల కాన్వాయ్‌ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

4,800 మంది ట్రాఫిక్ సిబ్బంది మోహరింపు

వీవీఐపీ రాకపోకలు, కాన్వాయ్‌ల రిహార్సల్స్ సమయంలో అవసరాన్ని బట్టి 22 ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

ఇందుకోసం సుమారు 4,800 మంది ట్రాఫిక్ సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో విధుల్లో నియమించారు.

మథురా రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, శాంతి పథ్, జనపథ్, అశోకా రోడ్, బరాఖంబా రోడ్, టాల్‌స్టాయ్ మార్గ్, ఆఫ్రికా అవెన్యూ రోడ్, నీతి మార్గ్, ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ తదితర మార్గాల్లో వివిధ సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు లేదా వాహనాల మళ్లింపులు ఉండవచ్చని అధికారులు తెలిపారు.

మొత్తంగా 35కుపైగా రహదారులపై రాకపోకలపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

బస్సుల రూట్లలో మార్పులు

సదస్సు జరిగే రోజుల్లో పరిస్థితిని బట్టి నగరంలోని బస్సుల మార్గాలను తాత్కాలికంగా మార్చే అవకాశం ఉంది.

అవసరమైతే కొన్ని రూట్లలో బస్సుల రాకపోకలను కొంతసేపు నియంత్రించనున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే క్యాబ్ సేవలు మాత్రం సాధారణంగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.

అత్యవసరం కాని ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ఢిల్లీ వాసులకు అధికారులు సూచించారు.

బయటకు వెళ్లే ముందు ఆ సమయంలో అమల్లో ఉన్న ట్రాఫిక్ పరిస్థితులు, మార్గమళ్లింపులపై తాజా సమాచారం తెలుసుకుని ప్రయాణం ప్రారంభించాలని కోరారు.

ADVERTISEMENT