Telangana: తెలంగాణలోని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్లు తప్పనిసరి: డీజీపీ సీవీ ఆనంద్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. ఈగల్ ఫోర్స్ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో డీజీపీ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా సమర్థమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే అన్ని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ నియామకం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
వివరాలు
కమిటీల అమలు విధానం, వాటి బాధ్యతలు, కార్యాచరణపై ప్రజెంటేషన్
విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలు, డ్రగ్స్ నివారణ చర్యలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, అవసరమైన కౌన్సెలింగ్, తల్లిదండ్రులతో సమన్వయం వంటి బాధ్యతలను ఈ కమిటీలు పర్యవేక్షించనున్నట్లు డీజీపీ వెల్లడించారు.
కమిటీల అమలు విధానం, వాటి బాధ్యతలు, కార్యాచరణపై ఈగల్ ఫోర్స్ అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
డ్రగ్స్ నియంత్రణలో పోలీసు, విద్య, ఆరోగ్య శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి సమర్థవంతమైన కార్యాచరణను అమలు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీలు పద్మజరెడ్డి, గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.