Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. కైపమంగళం ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కారు గురువాయుర్ నుంచి కొడుంగళూరు వైపు వెళ్తుండగా హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అతికష్టమ్మీద కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు.
వివరాలు
ఏడుగురు ఘటనాస్థలంలోనే మృతి
ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు ఘటనాస్థలంలోనే మృతిచెందారు.
మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు.
మృతులంతా తమిళనాడులోని దిండిగుల్ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.
అయితే మృతుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై మరమ్మతు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.