Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి కానుకతో మహిళలకు వరలక్ష్మీ వ్రతం.. 10 వేల చీరల పంపిణీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు శ్రావణ మాస కానుకగా వరుసగా మూడో ఏడాది 10 వేల చీరలను పంపించారు. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు పవన్ కల్యాణ్ పంపించిన చీరలతో పాటు పసుపు, కుంకుమ కిట్లను అందజేశారు. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే నానాజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కల్యాణం శివశ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన ఫైవ్మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి మహిళలకు చీరలు, పసుపు, కుంకుమ కిట్లను పంపిణీ చేశారు.
వివరాలు
ఆలయ దేవతలకు పట్టువస్త్రాల సమర్పణ
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఐదు విడతల్లో మహిళలు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పంపించిన చీరలను అందుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ముందు జనసేన నాయకులు పాదగయ క్షేత్రంలోని కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి, పదో శక్తిపీఠం పురుహుతిక అమ్మవారు, దత్తాత్రేయస్వామి వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పాడా పీడీ డా. శివరామ్ప్రసాద్, ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ పర్యవేక్షించారు.