Ashwini Vaishnaw: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే విస్తరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్.. 5 ప్రాజెక్టులకు ఓకే
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కీలక రైల్వే మార్గాల్లో మల్టీట్రాకింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపగా.. వీటిలో దక్షిణాదికి 5, ఉత్తరాదికి 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో ఈ ఐదు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. నాలుగు రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ అదనపు రైల్వే లైన్లను నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.10,021 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
2029-30 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యం
2029-30 నాటికి ఈ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త లైన్లు అందుబాటులోకి రావడంతో దక్షిణ భారతదేశంలోని 2,121 గ్రామాలకు రైలు మార్గం ద్వారా మెరుగైన అనుసంధానం ఏర్పడనుంది.
రైల్వే రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు, సరుకు రవాణాకు మరింత సౌకర్యం కలగనుంది.
వివరాలు
దక్షిణాదిలో ప్రాజెక్టులు ఇవే..
ఘట్కేసర్-కాజీపేట మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.రూ.2,419 కోట్ల అంచనా వ్యయంతో 110కిలోమీటర్ల మేర ఈ లైన్ను నిర్మించనున్నారు.
అరక్కోణం-రేణిగుంట సెక్షన్లో 77కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అదనపు సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
కర్ణాటకలోని వైట్ఫీల్డ్-బంగారుపేట మార్గంలో 47కిలోమీటర్ల మేర మూడో,నాలుగో లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు.
సేలం-కరూర్-దుండిగల్ మార్గంలో 159 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ మార్గంలో రెండు అదనపు ట్రాక్లతో రైల్వే సామర్థ్యం పెరగనుంది.
అదేవిధంగా హోసూర్-ఒమలూరు మధ్య 147 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ డబ్లింగ్ పనులను చేపట్టేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది.