Social Media: ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా పోస్టులపై త్వరలో కొత్త నిబంధనలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసే పోస్టులు, పంచుకునే సమాచారంపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కోడ్ ఆఫ్ కండక్ట్పై చర్చ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 'సోషల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్' తీసుకురావాలనే ప్రతిపాదన ఉన్నతస్థాయిలో చర్చకు వచ్చినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీనియర్ అధికారులను ఆయన కోరినట్లు తెలుస్తోంది.
వివరాలు
అందరికీ ఒకే నిబంధనలు?
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించే అవకాశం ఉంది.
ఉద్యోగి ఏ స్థాయిలో పనిచేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ఒకే తరహా మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అయితే కొత్త కోడ్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఉద్యోగులు ఎలాంటి పోస్టులు చేయవచ్చు? ఏ అంశాలపై పరిమితులు విధిస్తారు? ఉల్లంఘన జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వంటి విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
వివరాలు
వ్యక్తిగత ప్రచారంపైనే ప్రధాన దృష్టి
ఇటీవలికాలంలో కొందరు ప్రభుత్వ అధికారులు సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
కొందరు యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తుండగా.. మరికొందరు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు,రీల్స్ చేస్తున్నారు.
తమ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.
దీంతో అధికారికసమాచారానికి,వ్యక్తిగత కంటెంట్కు మధ్య ఉన్న గీత చెరిగిపోతోందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం శాఖలవారీగా అమలవుతున్న సర్వీస్ రూల్స్
ప్రస్తుతం కేంద్రప్రభుత్వంలోని అన్ని శాఖలకు వర్తించేలా ఒకే రకమైన సోషల్ మీడియా నిబంధనలు లేవు.
ఉద్యోగులపై ఆయా శాఖలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ అమలవుతున్నాయి.
అయితే సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ పాత నిబంధనలు ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి కొత్త తరహా డిజిటల్ కంటెంట్ వేదికలకు పూర్తిగా సరిపోవడం లేదనే అభిప్రాయం ఉంది.
వివరాలు
ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు?
కొత్త సోషల్ మీడియా కోడ్ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు ఆన్లైన్లో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించడం, వీడియోలు లేదా ఇతర కంటెంట్ ప్రచురించడం, అధికారిక సమాచారాన్ని పంచుకోవడం వంటి అంశాలపై నిబంధనలు ఉండొచ్చని తెలుస్తోంది.
అదే సమయంలో నియమాలను ఉల్లంఘించిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా కోడ్లో పొందుపరిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
2017లో బీఎస్ఎఫ్ జవాన్ వీడియోతో చర్చ
సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగుల కార్యకలాపాలపై చర్చకు దారితీసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.
2017లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ ఆహార నాణ్యతపై వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారంలో సర్వీస్ రూల్స్ ఆధారంగా చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం మరింత విస్తరించిన నేపథ్యంలో ప్రత్యేకంగా డిజిటల్ వేదికలకు అనుగుణమైన నిబంధనలు అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వివరాలు
సోషల్ మీడియాపై కేంద్రం కఠిన వైఖరి
మరోవైపు సోషల్ మీడియా వేదికలపై కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపడుతోంది.
అక్రమ కంటెంట్ను తొలగించాల్సిన గడువును తగ్గించడం, కృత్రిమ మేధ (AI)తో రూపొందించిన కంటెంట్ను వినియోగదారులు సులభంగా గుర్తించేలా స్పష్టమైన గుర్తింపులు ఉండేలా చూడటం వంటి చర్యలను ఇప్పటికే చేపట్టింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగానికి ప్రత్యేక కోడ్ తీసుకురావాలనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.