Illegal Service Charges: సేవా రుసుము పేరుతో అదనపు వసూళ్లు వద్దు.. హోటళ్లకు కేంద్రం హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారుల బిల్లుల్లో ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జీ (సేవా రుసుము) జోడించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం బుధవారం హెచ్చరించింది. ఈ అంశంపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ (Department of Consumer Affairs) ఈ హెచ్చరిక జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు, కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) మార్గదర్శకాల ప్రకారం బిల్లులో తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీ విధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అయితే టిప్ (గ్రాట్యుటీ) ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా వినియోగదారుల ఇష్టానుసారమేనని పేర్కొంది.
వివరాలు
సర్వీస్ ఛార్జీపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు
ఈ విషయంపై పీటీఐ విడుదల చేసిన వీడియోలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే మాట్లాడుతూ, సర్వీస్ ఛార్జీపై తమకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
బిల్లులో వినియోగదారుల అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జీని ఆటోమేటిక్గా చేర్చడం చట్టవిరుద్ధమని ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.
గత ఏడాది వచ్చిన తీర్పుతో ఈ అంశంపై స్పష్టత వచ్చిందని, అయినప్పటికీ కొందరు హోటళ్లు, రెస్టారెంట్లు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీలో నిర్వహించిన 'FICCI MASSMERIZE 2026 Retail, FMCG and E-commerce Conference' సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, ఇకపై అందే ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు పంపించి చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మీడియాతో మాట్లాడుతున్న నిధి ఖరే
VIDEO | Nidhi Khare, Secretary, Department of Consumer Affairs, said, "We have taken a lot of complaints on service charge, which the Honourable High Court had also said that restaurants and hotels should not charge. And if we find, we will be taking action, because now it is a… pic.twitter.com/kJoxd3cLtT
— Press Trust of India (@PTI_News) August 4, 2026
వివరాలు
60కుపైగా హోటళ్లు,రెస్టారెంట్లకు నోటీసులు జారీ
"సర్వీస్ ఛార్జీపై మాకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారంలో 60కుపైగా హోటళ్లు,రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశాం" అని నిధి ఖరే వెల్లడించారు.
గత ఏడాది మార్చి 28న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా ఎం.సింగ్ కీలక తీర్పు ఇచ్చారు.
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(NRAI),భారతదేశ హోటల్,రెస్టారెంట్ అసోసియేషన్ల సమాఖ్య (FHRAI) దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
2022లో CCPA జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ ఈ సంస్థలు కోర్టును ఆశ్రయించగా,బిల్లులో తప్పనిసరిగా సర్వీస్ ఛార్జీ వసూలు చేయడం వినియోగదారులను పన్నుల మాదిరిగా తప్పుదోవ పట్టించే చర్యగా, అన్యాయ వాణిజ్య పద్ధతిగా కోర్టు పేర్కొంది.
వివరాలు
'Chaayos' సంస్థపై రూ.50 వేల జరిమానా
రెస్టారెంట్ల ప్రయోజనాల కంటే వినియోగదారుల హక్కులకే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేస్తూ, పిటిషనర్లు ఒక్కొక్కరు రూ.1 లక్ష చొప్పున వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది.
ఇటీవల CCPA, బిల్లులో ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జీ చేర్చినా, దానిని "స్వచ్ఛందం"గా పేర్కొన్నందుకు 'Chaayos' సంస్థపై రూ.50 వేల జరిమానా విధించింది.
సర్వీస్ ఛార్జీని తిరిగి చెల్లించడంలో విఫలమైన ఢిల్లీలోని పలు రెస్టారెంట్లపైనా చర్యలు తీసుకుంది.
CCPA 2022 మార్గదర్శకాల ప్రకారం బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుల బిల్లుల్లో డిఫాల్ట్గా సర్వీస్ ఛార్జీని జోడించకూడదు.
అలాంటి చెల్లింపు పూర్తిగా ఐచ్ఛికమని, వినియోగదారులు తమ ఇష్టానుసారమే టిప్ లేదా సర్వీస్ ఛార్జీ చెల్లించవచ్చని స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.