Loading...
Sushmitha Konidela: చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు

Sushmitha Konidela: చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమెను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ కార్యదర్శి కన్నబాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవితో సుస్మిత దుర్గమ్మ ఆలయానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కానున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, దసరా నవరాత్రులతో పాటు ఇతర ప్రత్యేక ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ట్రస్ట్ బోర్డుకు తన సూచనలు, సలహాలు అందించనున్నారు.

వివరాలు 

తెలంగాణ యాదాద్రి బోర్డులో సభ్యురాలిగా కొనసాగుతున్న చిరంజీవి అర్ధాంగి సురేఖ

సినీ రంగంలోనూ సుస్మితకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్‌పై ఆమె పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.

ఇటీవల తన తండ్రి చిరంజీవితో కలిసి నిర్మించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో ఆమె మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

సుస్మితకు ఆలయ పాలకమండలిలో బాధ్యతలు దక్కడం మరో ఆసక్తికరమైన విషయానికి కారణమైంది.

ఆమె తల్లి కొణిదెల సురేఖ ఇప్పటికే తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.

ఇప్పుడు సుస్మితకు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయమైన కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో స్థానం లభించింది.

దీంతో తల్లీకూతుళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల పాలక వ్యవస్థల్లో భాగస్వాములు కావడం విశేషంగా మారింది.

ADVERTISEMENT