Andhra woman: ఏపీలో సంచలనం.. భర్తతో దైవ దర్శనానికి వెళ్లి.. ప్రియుడితో కలిసి చంపేసింది..
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుడి దర్శనం పేరుతో భర్తను తీసుకెళ్లిన భార్య, తన ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా భర్త బైక్పైనే ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైన ఘటన గుడిపల్లి మండలంలోని మల్లప్పకొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. శాంతిపురం మండలం బోయినపల్లికి చెందిన హాసినికి తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్తో రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. హోసూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రమేష్ కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
వివరాలు
భర్తను తొలగించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక
అయితే వివాహానికి ముందు నుంచి తన చిన్ననాటి స్నేహితుడు యుగంధర్తో ఉన్న ప్రేమ సంబంధాన్ని హాసిని కొనసాగించినట్లు విచారణలో వెల్లడైంది.
పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగుతుండటంతో, భర్త తమకు అడ్డుగా ఉన్నాడనే భావనతో హత్యకు పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
రెండు రోజుల క్రితం హాసిని తన కుమార్తెతో కలిసి బోయినపల్లిలోని తల్లి ఇంటికి వచ్చింది.
ఈ సమయంలో యుగంధర్ను పలుమార్లు కలిసిన ఆమె, భర్తను తొలగించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం రమేష్తో కలిసి మల్లప్పకొండలోని మల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్దామని చెప్పి బైక్పై బయలుదేరింది.
ప్రయాణమంతా ప్రియుడు యుగంధర్కు తన కదలికల గురించి సమాచారం అందించినట్లు పోలీసులు చెబుతున్నారు.
వివరాలు
యుగంధర్తో మరో నలుగురు రమేష్పై దాడి చేసి హత్య
మల్లప్పకొండకు వెళ్లే మార్గంలోని మూడో మలుపు వద్దకు చేరుకున్న తర్వాత హాసిని కావాలనే తన పర్స్ను కింద పడేసినట్లు గుర్తించారు.
పర్స్ పడిపోయిందని చెప్పడంతో రమేష్ బైక్ను ఆపి దాన్ని తీసుకురావడానికి వెళ్లాడు.
అదే సమయంలో అక్కడే ముందుగా వేచి ఉన్న యుగంధర్తో పాటు మరికొందరు రమేష్ను పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
అక్కడ యుగంధర్తో కలిసి మరో నలుగురు రమేష్పై దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలేసి, రమేష్ బైక్పైనే హాసినిని తీసుకుని సమీప రైల్వే స్టేషన్కు చేరుకున్న యుగంధర్.. అక్కడి నుంచి ఇద్దరూ పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
వివరాలు
మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో రమేష్ మృతదేహం
ఇదిలా ఉండగా, మల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన రమేష్ కుటుంబం తిరిగి ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి తన కుమార్తె కనిపించడం లేదంటూ నిన్న ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీలతో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు.
మొదట రమేష్, హాసిని, చిన్నారి కలిసి వెళ్తున్న దృశ్యాలు కనిపించగా, కొద్దిసేపటి తర్వాత రమేష్ బైక్పై హాసిని మరో ఇద్దరు యువకులతో వెళ్తున్నట్లు సీసీటీవీల్లో గుర్తించారు.
అనంతరం మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో రమేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
పోలీసుల అదుపులో హాసినితో పాటు మరో నలుగురు
ప్రాథమిక విచారణలో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో హాసిని తన ప్రియుడు యుగంధర్తో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఈ కేసులో హాసినితో పాటు మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రమేష్ హత్య కేసుపై రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు.
పోలీసులు నిందితులను విచారిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే పనిలో ఉన్నారు.