CJI Surya Kant: 'పోలీసుల చర్యలపై పిటిషన్ దాఖలే కాలేదు'.. తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై సీజేఐ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదన్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)సూర్యకాంత్ ఖండించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఎలాంటి రిట్ పిటిషన్ దాఖలు కాలేదని,కేవలం న్యాయవాది నరేంద్ర మిశ్రా పంపిన ఒక లేఖ మాత్రమే తమకు అందిందని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం దాఖలు చేసిన పిటిషన్ లేకుండా ఆ లేఖను కేసుగా పరిగణించలేమని తెలిపారు. గత రెండురోజులుగా సీజేఐ కేసును జాబితాలో చేర్చేందుకు నిరాకరించారంటూ కొన్ని మీడియాసంస్థలు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బాధ్యతారహితంగా,నిర్లక్ష్యంగా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. జూలై 22న విద్యార్థుల నిరసనలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారంటూ సుమోటోగా విచారణ చేపట్టాలని నరేంద్రమిశ్రా కోర్టును కోరారు.
వివరాలు
వీడియోలు చూసేందుకు సమయం లేదు: CJI కాంత్
నిరసనకారులపై పోలీసులు దాడి చేసినట్లు చెబుతున్న వీడియోలను కూడా కోర్టు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, వీడియోలు చూసేందుకు తమకు సమయం లేదని ధర్మాసనం పేర్కొంటూ ఆ అభ్యర్థనను స్వీకరించలేదు.
ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు మాత్రం నిరసనల సందర్భంగా జరిగిన పోలీసు చర్యలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర రికార్డులను భద్రపరచాలని అధికారులను ఆదేశించింది.
ఈ ఘటనపై దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం,ఢిల్లీ పోలీసుల నుంచి సమాధానం ఇవ్వాలని కోరింది.
ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.
మరోవైపు, పరీక్షల సంస్కరణలు,బాధ్యతాయుత వ్యవస్థపై కేంద్రం హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను విరమించారు.