Andhra Pradesh : ఉగాది నుంచి పాఠశాలల్లో డిజిటల్ గ్రీన్ టెక్నాలజీ పార్కులు
ఈ వార్తాకథనం ఏంటి
ఉగాది నుంచే పాఠశాలల ప్రాంగణాల్లో పచ్చదనం పెంచేలా దేశీయ మొక్కల పెంపకంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అటవీ శాఖతో కలిసి అన్ని పాఠశాలల్లో డిజిటల్ గ్రీన్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని, ఎకరం ప్రాతిపదికన ఇందుకు అయ్యే ఖర్చును అంచనా వేయాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో కూరగాయల కొనుగోలుకు ఖర్చయ్యే మొత్తాన్ని ఈ పార్కుల నిర్వహణ బాధ్యతలు చేపట్టే వారికి ఇవ్వడం సాధ్యమా అనే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను కూడా నిర్వహణలో భాగస్వాములను చేయాలని, పరిశ్రమల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.
వివరాలు
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక
తీరప్రాంతాల్లో కోత నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రశంసించారు. సముద్రతీరంలో ఆర్కిడ్స్ సాగు చేపడితే రైతులకు ఆదాయం పెరగడంతో పాటు కోతను కూడా అడ్డుకోవచ్చని సూచించారు. విద్యార్థుల ఆత్మహత్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఇవి పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్లు విద్యార్థులతో తరచూ సమావేశాలు నిర్వహించాలని, పరీక్షల ఒత్తిడి తగ్గేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని, వయోజన విద్యలో మెరుగైన ఫలితాల కోసం డ్వాక్రా మహిళల సహకారం తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలని సూచించారు.
వివరాలు
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం
రైతుల బలవన్మరణాలు జరగకూడదని, ఒకవేళ జరిగితే కారణాలపై ఆడిట్ చేసి లోపాలు ఉంటే సరిదిద్దుతూ రైతుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఆదేశించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు మైక్రో ఇరిగేషన్ ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామని, ఆ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. నిధుల కొరత ఎదుర్కొంటున్న రహదారులు, సాగునీటి, పర్యాటక తదితర నిర్మాణ ప్రాజెక్టులను వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, పీపీపీ విధానంలో చేపడతామని సీఎం వెల్లడించారు. దీనిపై అన్ని శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత ఇచ్చామని, దాని ప్రకారం కలెక్టర్లు పనిచేస్తే అభివృద్ధి స్వయంగా ముందుకు సాగుతుందని చెప్పారు.
వివరాలు
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం
వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులన్నింటినీ పూర్తిగా వినియోగించాలని, మరిన్ని నిధులను కేంద్రం నుంచి తెచ్చుకోవాలని సూచించారు. 'నిధులు లేవనేది సాకు మాత్రమే; మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పటికే అనేక సమస్యలను అధిగమించి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నాం. అధికారులు అశ్రద్ధ లేకుండా పాజిటివ్గా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. తరచూ సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి' అని సీఎం దిశానిర్దేశం చేశారు.