Page Loader
Cognizant: విశాఖలో కాగ్నిజెంట్‌ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు

Cognizant: విశాఖలో కాగ్నిజెంట్‌ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
09:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఒక శుభవార్త వెలువడింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విశాఖపట్టణం సమీపంలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌ ప్రాంతంలో సుమారు రూ.1,583 కోట్ల వ్యయంతో 22 ఎకరాల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సంస్థ సోషల్ మీడియా వేదిక 'X' ద్వారా ప్రకటించింది. భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెంచుతున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కొత్త క్యాంపస్‌ ఏర్పాటుతో దాదాపు 8 వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి, ఇది రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది.

వివరాలు 

తాత్కాలిక సెంటర్‌ ఏర్పాటు

2026 నాటికి సుమారు 800 మందికి వసతులు కల్పించేలా ఒక తాత్కాలిక సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అదే ఏడాది నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కాగ్నిజెంట్‌ సిద్ధమవుతోంది. పూర్తిస్థాయి క్యాంపస్‌ను 2029 ఆరంభంలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం ప్రత్యేకత గురించి మాట్లాడిన కాగ్నిజెంట్‌ CEO ఎస్‌. రవి కుమార్‌ ఈ నగరంలో ఉన్న ప్రతిభ, మౌలిక సదుపాయాలు సంస్థను ఆకర్షించాయని తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో తమ సేవలను విస్తరించాలనే లక్ష్యంతోనే విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకున్నామని ఆయన స్పష్టంగా చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 కాగ్నిజెంట్‌ చేసిన ట్వీట్