
Coldrif Syrup: కోల్డ్రిఫ్ విషాదం.. 11 మంది చిన్నారుల మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కోల్డ్రిఫ్ సిరప్ వాడకంతో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిరప్ను పిల్లలకు రాసిన డాక్టర్ ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. మరణించిన చిన్నారులలో చాలా మంది పరాసియాలోని ఆయన క్లినిక్లో చికిత్స పొందినట్లు తేలింది. ఈ సిరప్ను తయారు చేసిన సంస్థ తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రీసాన్ ఫార్మాస్యూటికల్స్. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ సంస్థపై కేసు నమోదు చేసింది. గతంలోనే కోల్డ్రిఫ్ అమ్మకాలపై నిషేధం విధించినట్లు అధికారులు గుర్తుచేశారు. నమూనాల పరిశీలనలో 48.6% వరకు డైథిలిన్ గ్లైకాల్ (Diethylene Glycol) ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత విషపూరితమైన పదార్థమని తెలిపారు.
Details
ఔషదం నాణ్యత లేనిదిగా ప్రకటింపు
చెన్నై డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ నివేదిక అనంతరం తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ ఈ ఔషధాన్ని 'ప్రామాణిక నాణ్యత లేనిదిగా ప్రకటించింది. ఈ పరిణామాల నడుమ సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్, నెక్ట్రో డీఎస్ విక్రయాలను పూర్తిగా నిషేధించింది. కోల్డ్రిఫ్పై రిపోర్టు ఇప్పటికే వెలువడగా, నెక్ట్రో డీఎస్ నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల వాంగ్మూలం ప్రకారం, జలుబు, తేలికపాటి జ్వరానికి ఈ సిరప్ను వాడారు. ప్రారంభంలో లక్షణాలు తగ్గినప్పటికీ, కొద్ది రోజులకే పరిస్థితి తీవ్రమైందని తెలిపారు. మూత్ర విసర్జన అకస్మాత్తుగా తగ్గిపోవడం, కిడ్నీ సంబంధిత సమస్యలు రావడం చివరికి మరణానికి దారితీసినట్లు వివరించారు. కిడ్నీ బయాప్సీ పరీక్షల్లోనూ డైథిలిన్ గ్లైకాల్ అవశేషాలు బయటపడ్డాయి.