Serial killer: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కలకలం.. సీరియల్ కిల్లర్ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణించి వరుస హత్యలు చేస్తున్న ఓ సీరియల్ కిల్లర్ను గుజరాత్లోని వల్సాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలా నిందితుడి వివరాలను వెల్లడించారు. భోలో కరమ్వీర్ జాట్ అనే ఈ నిందితుడు హర్యానాకు చెందినవాడిగా గుర్తించారు.
గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో అనేక నేరాలకు పాల్పడ్డ అతను ఇటీవల రైల్వేలో సీరియల్ కిల్లర్గా మారాడు. 35 రోజుల వ్యవధిలో ఐదు రాష్ట్రాల్లో ఐదు హత్యలు చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.
కరమ్వీర్ సాధారణంగా రైళ్లలోని లాస్ట్ భోగీలో ఉండే వికలాంగుల కంపార్ట్మెంట్లో ఎక్కుతాడు. అక్కడ ప్రయాణికులపై అత్యాచారాలు, హత్యలు, దోపిడీలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు.
Details
హత్య చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు
గత ఆదివారం సికింద్రాబాద్లోని ఓ రైలులో వికలాంగుల పెట్టెలో ఒక మహిళ మృతదేహం కనబడింది.
ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వల్సాద్ పోలీసులు అందించిన సమాచారంతో సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు నిందితుడి గురించి కీలక ఆధారాలను సేకరించారు.
వల్సాద్ పోలీసులు అరెస్టు చేసిన కరమ్వీర్ను విచారించగా, సికింద్రాబాద్ హత్యను తానే చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ ఘటనలు దేశంలోని రైల్వే భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
సీరియల్ కిల్లర్ కేవలం 35 రోజుల్లో ఐదు హత్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది.