Page Loader
Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్
పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్

Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తీవ్రంగా స్పందించారు. స్మారకం నిర్మించే ప్రాంతం కాకుండా నిగంబోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు రాజకీయ అంశంగా మలచడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. 'గాంధీ కుటుంబం' గాంధీయేతర కాంగ్రెస్‌ నేతలకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు తమపై తప్పుడు ఆరోపణలు చేయడం విచారకరమని అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించినప్పుడు ఆయనకు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్‌ పార్టీ నైజాన్ని ప్రతిబింబించిందన్నారు. ఇది ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతుందని జోషి గుర్తుచేశారు.

Details

అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలి

పీవీ నరసింహరావు, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లకు కూడా కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై గాంధీ కుటుంబం ఆత్మపరిశీలన చేయాలని సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో తమకు సైద్ధాంతిక, రాజకీయ విభేదాలు ఉన్నా ఆయన అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మన్మోహన్ సింగ్‌ అంత్యక్రియల ఏర్పాటుకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఆయనకు తగిన గౌరవం ఇవ్వడంలో ఏ లోటూ జరగలేదని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ, మన్మోహన్ సింగ్‌ అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Details

ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా సంచలన వ్యాఖ్యలు

ఇటీవల ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రపతులకు నివాళులర్పించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం లేదని చెప్పారు. అయితే తన తండ్రి డైరీ చదివిన తర్వాత, రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ మరణం సందర్భంగా సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించారన్న నిజాన్ని తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర-కాంగ్రెస్‌ మధ్య వివాదాన్ని మరింత పెంచుతున్నాయి.