Wayanad: టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ఇంజినీర్లు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని వయనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రదేశంలో మంగళవారం జరిగిన కొండచరియల విరిగిపడిన ఘటన ముందే ఊహించదగినదేనని అంతర్గత సాంకేతిక నివేదిక వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. టన్నెల్ పనులను నిర్వహిస్తున్న ఉప కాంట్రాక్టర్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ (DBL) సిద్ధం చేసిన అంతర్గత నివేదికను ఎన్డీటీవీ పరిశీలించగా, టన్నెల్ ఉత్తర ప్రవేశద్వారం (నార్త్ పోర్టల్) వద్ద ఉన్న కొండ వాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదంలో ఉందని అప్పటికే హెచ్చరించినట్లు వెల్లడైంది. ఈ నివేదికను డీబీఎల్ సీనియర్ జియాలజిస్ట్ రాజు సాగర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) శాస్త్రవేత్త ఏ. రమేశ్ కుమార్, ప్రాజెక్టు అథారిటీ ఇంజినీర్ డాక్టర్ హెచ్.కే. సింగ్ సంయుక్తంగా సిద్ధం చేసి ఆమోదించారు.
వివరాలు
ఉత్తర పోర్టల్ వద్దే ప్రమాదం
వయనాడ్ టన్నెల్ ప్రాజెక్టుకు రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.కోజికోడ్ వైపు అనక్కంపొయిల్ వద్ద దక్షిణ పోర్టల్, వయనాడ్లో కల్లడి-మెప్పాడి సమీపంలో ఉత్తర పోర్టల్ ఉన్నాయి. ప్రమాదం చోటుచేసుకున్నది ఉత్తర పోర్టల్ వద్దే. జూన్ 3 నుంచి 11 మధ్య ప్రాంతాన్ని పరిశీలించిన ఇంజినీర్లు,టన్నెల్ ముఖద్వారం పైన సుమారు 35 మీటర్ల లోతు వరకు సడలిన మట్టి పొర ఉందని గుర్తించారు. ఈ మట్టి వర్షపు నీటిని సులభంగా బయటకు పంపకపోవడంతో నీరు లోపలే నిల్వై మట్టి బరువెక్కి బలహీనపడుతూ జారిపడే పరిస్థితి ఏర్పడుతుందని నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
భూగర్భంలో నీరు ప్రవహిస్తున్న శబ్దం
వాలును రక్షించేందుకు మెట్ల మాదిరిగా కోతలు పెట్టడం,షాట్క్రీట్ అనే కాంక్రీట్ పొర వేయడం, స్టీల్ సాయిల్ నెయిల్స్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టినా,అప్పటికే వాలులో పలు చోట్ల పగుళ్లు ఏర్పడినట్లు ఇంజినీర్లు నమోదు చేశారు. మట్టి జారిపోవడం, బురద నీరు బయటకు రావడం, లోపల ఖాళీలు ఏర్పడడం వంటి సంకేతాలు స్పష్టంగా కనిపించాయని నివేదిక తెలిపింది. ఇంజినీర్లను అత్యంత ఆందోళనకు గురిచేసిన అంశం భూగర్భంలో నీరు ప్రవహిస్తున్న శబ్దం వినిపించడం. మట్టిలోపల నీరు మార్గాన్ని ఏర్పరచుకుని నెమ్మదిగా వాలను లోపల నుంచి బలహీనపరుస్తోందని, ఇది ఎప్పుడైనా ఒక్కసారిగాకూలే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ప్రత్యేకంగా ఎడమవైపు వాలు కుడివైపు కంటే చాలా ప్రమాదకరమని నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
సమర్థంగా పనిచేయని డ్రైనేజ్ రంధ్రాలు
ప్రస్తుత వర్షపాతం పరిస్థితుల్లో ఈ వాలు "ఎప్పుడైనా అకస్మాత్తుగా కూలిపోవచ్చు" అని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. నీటి ఒత్తిడిని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డ్రైనేజ్ రంధ్రాలు కూడా సమర్థంగా పనిచేయడం లేదని నివేదికలో పేర్కొన్నారు. భూగర్భ జలాల ఒత్తిడిని కొలిచే పీజోమీటర్లు వంటి హెచ్చరిక పరికరాలు ఇంకా ఏర్పాటు చేయలేదని, ప్రస్తుతం ఉన్న పర్యవేక్షణ వ్యవస్థ కూడా వాస్తవ పరిస్థితిని సరిగా ప్రతిబింబించడం లేదని వెల్లడించింది. ఇదే సమయంలో జూన్ 5, 6, 11 తేదీల్లో టన్నెల్ కోసం ట్రయల్ బ్లాస్టింగ్ నిర్వహించారు. అయితే పేలుళ్ల వల్ల ఏర్పడిన కంపనలు భద్రతా ప్రమాణాల్లోనే ఉన్నాయని, వాలులో పగుళ్లకు ప్రధాన కారణం భారీ వర్షాలేనని నివేదిక తేల్చింది.
వివరాలు
ఈ చర్యలను సూచించిన నివేదిక
ప్రమాదాన్ని నివారించేందుకు గేబియన్ గోడలు నిర్మించడం,వాలను రక్షణ మ్యాట్లతో పూర్తిగా కప్పడం, టార్పాలిన్ పరచడం, వర్షపు నీరు నేరుగా మట్టిలోకి చొరబడకుండా ప్రత్యేక కాలువలు నిర్మించడం వంటి చర్యలను నివేదిక సూచించింది. అలాగే ఇప్పటికే ఏర్పాటు చేసిన సాయిల్ నెయిల్స్, డ్రైనేజ్ వ్యవస్థలు నీటితో నిండిన పరిస్థితుల్లో సరిగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించాలని కూడా సిఫార్సు చేసింది. అంతేకాక, ప్రమాదకర వాలుకు సమీపంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ కూడా భూభాగ స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, దానిని మరో ప్రాంతానికి తరలించాలని ఇంజినీర్లు సూచించారు.
వివరాలు
ప్రామాణిక నిబంధనల ప్రకారమే పనులు
ఈ నివేదికపై స్పందించిన కొంకణ్ రైల్వేకు చెందిన ఓ ఇంజినీర్, బ్లాస్టింగ్ ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ అధ్యయనం చేపట్టామని, నివేదిక వచ్చిన వెంటనే ఉత్తర పోర్టల్ వద్ద పనులు పూర్తిగా నిలిపివేశామని తెలిపారు. షాట్క్రీట్తో పాటు 12 మీటర్ల పొడవు గల కాంక్రీట్ రాడ్లను రెండు మీటర్ల దూరంతో మట్టిలో అమర్చామని చెప్పారు. అయితే కొండపై నుంచి భారీగా విరిగిపడిన భూభాగాన్ని ఎలాంటి భద్రతా చర్యలతోనూ అడ్డుకోవడం సాధ్యం కాలేదని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాకాల పరిస్థితులు, భూభాగం సున్నితత్వంపై తగిన అధ్యయనం చేయలేదన్న ప్రశ్నలకు మాత్రం అన్ని ప్రామాణిక నిబంధనల ప్రకారమే పనులు చేపట్టామని సమాధానం ఇచ్చారు.
వివరాలు
మట్టిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం సమయానికి భూమి కేటాయించలేదు: కాంట్రాక్టర్
అయితే గేబియన్ గోడలు, మట్టిని నిల్వ చేసే నిర్మాణాలు ఎందుకు తగిన ప్రమాణాలతో నిర్మించలేదనే ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఉత్తర పోర్టల్ వద్ద బ్లాస్టింగ్కు ముందు సరైన సన్నాహాలు జరిగాయా లేదా అన్న అంశంపైనా స్పష్టత ఇవ్వలేదు. తవ్విన మట్టిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం సమయానికి భూమి కేటాయించలేదని కాంట్రాక్టర్ పేర్కొన్నారు. టన్నెల్ పనులు పూర్తయ్యాక ఆ మట్టిని ఉపయోగించాల్సి ఉండటంతో దానిని భద్రపరచడానికి అవసరమైన స్థలం అందలేదని వివరించారు.
వివరాలు
ఆరు రోజుల ముందే డీబీఎల్ పనులను నిలిపివేత
ఈ ఘటన తర్వాత దక్షిణ పోర్టల్ వద్ద పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మికులు భయంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మొత్తంగా చూస్తే, ఈ అంతర్గత నివేదిక ప్రమాదం జరిగే అవకాశాన్ని ముందుగానే స్పష్టంగా గుర్తించింది. జిల్లా కలెక్టర్ జూన్ 20న పనులు నిలిపివేయాలని ఆదేశించే ఆరు రోజుల ముందే డీబీఎల్ పనులను నిలిపివేసినట్లు సమాచారం. దీంతో వర్షాకాలం ముగిసే వరకు వేచి ఉండాలనే నిర్ణయానికి ఇంజినీర్లు వచ్చినట్లు తెలుస్తోంది.