LOADING...
Cuttack: కటక్‌ దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ బంద్‌ 
Cuttack: కటక్‌ దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ బంద్

Cuttack: కటక్‌ దుర్గా మాత నిమజ్జనంలో ఉద్రిక్తత.. కర్ఫ్యూ, ఇంటర్నెట్‌ బంద్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలోని కటక్ పట్టణంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది ఈ ఘర్షణలలో మొత్తం 25మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు కటక్‌లో 36గంటల పాటు కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సమాచారం ప్రకారం, శనివారం రాత్రి దుర్గామాత నిమజ్జనానికి చెందిన ఊరేగింపు కటక్ పట్టణంలోని దర్గా బజార్ ప్రాంతం నుండి కఠాజోడి నది ఒడ్డుకు వెళుతున్నది. ఈ ఊరేగింపును ఒక వర్గం అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. అర్ధరాత్రి వేళ డీజే కారణంగా పెద్ద శబ్దంతో పాటలు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగి తీవ్రమైంది.

వివరాలు 

టక్‌ డీసీపీ రిషికేశ్‌ ఖిలారీతో సహా ఆరుగురికి గాయాలు 

ఘర్షణ సమయంలో పలు వ్యాపార స్థలాలు ధ్వంసమై, అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలో కటక్ డీసీపీ రిషికేశ్ ఖిలారీ సహా ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జ్‌, జనం గుంపులను చెదరగొట్టడం వంటి చర్యలు చేపట్టారు. చాలా కష్టంగా ఇరువర్గాల మధ్య గొడవను ముగింపుకు తీసుకువచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ సందర్భంలో పట్టణంలోని అనేక ప్రాంతాల్లో భద్రతకు కట్టుదిట్ట చర్యలు అమలు చేశారు. అయితే, ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆదివారం సాయంత్రం విశ్వ హిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

వివరాలు 

స్వల్ప లాఠీచార్జ్‌ చేసిన పోలీసులు 

ఈ ర్యాలీ కూడా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ర్యాలీ బిద్యాధర్‌పూర్ ప్రాంతం నుండి ప్రారంభమై దర్గా బజార్ గుండా సీడీఏ ప్రాంతంలోని సెక్టార్ 11 వద్ద ముగిసింది. ర్యాలీ మార్గంలో కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేయడం, గౌరీశంకర్ పార్క్ ప్రాంతంలోని పలు దుకాణాలను నాశనం చేయడం, వాటికి మంటలు కట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. శాంతిని భంగం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నందున, పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ ద్వారా వర్గాలను చెదరగొట్టారు. ఈ కారణంగా కటక్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో భద్రత కోసం 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.

వివరాలు 

ఉద్రిక్తతలు పెరగకుండా ఇంటర్నెట్ సేవల బంద్ 

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, ఉద్రిక్తతలు పెరగకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. దర్గా బజార్, మంగళబాగ్‌, కంటోన్మెంట్‌, పూరిఘాట్‌, లాల్‌బాగ్‌, బిడానసి, మార్కట్‌ నగర్‌, సీడీఏ ఫేజ్‌-2, మాల్గోదామ్‌, బాదామ్‌బండి, జగత్‌పూర్‌, బయాలిస్‌ మౌజా, సాదర్‌, గౌరీశంకర్ పార్క్‌, బిద్యాధర్‌పూర్ వంటి ప్రాంతాల్లో భద్రతని గణనీయంగా పెంచారు. స్థానిక పోలీస్ బలగాలతో పాటు కేంద్ర సాయుధ బలగాలను కూడా ఆ ప్రాంతాల్లో భారీగా మోహరించారు.