DAC Clears 1.10 Lakh Crore : త్రివిధ దళాలకు మెగా బూస్ట్.. రూ.1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ అవసరాల కోసం సుమారు రూ.1.10 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలు, అధునాతన సాంకేతిక వ్యవస్థల కొనుగోలుకు రక్షణ సేకరణ మండలి (డీఏసీ) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సెప్టెంబర్ 7న జరిగిన డీఏసీ సమావేశంలో ఆయా ప్రతిపాదనలకు 'అవసరాల అంగీకారం' (Acceptance of Necessity)కు పచ్చజెండా ఊపారు. రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం కొనుగోళ్లలో దాదాపు 98 శాతం ఆయుధాలు, పరికరాలను భారతీయ పరిశ్రమల నుంచే సమీకరించనున్నారు.
వివరాలు
ఆర్మీకి కొత్త వాహనాలు,హెలికాప్టర్లు
భారత సైన్యం సామర్థ్యాన్ని పెంచేందుకు పలు కీలక పరికరాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం ఇచ్చింది.
రసాయన, జీవ, రేడియోలాజికల్, అణు (సీబీఆర్ఎన్) రక్షణ వాహనాలు, హై మొబిలిటీ వాహనాలు, సెల్ఫ్ ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, ట్రాల్ ట్యాంకులు, 'సర్వత్ర బ్రిడ్జ్ సిస్టమ్' ఇందులో ఉన్నాయి.
సీబీఆర్ఎన్ రీకానసెన్స్ వాహనాలు విషపూరిత పదార్థాలు, రసాయనాలు వ్యాపించిన ప్రాంతాలను గుర్తించి పర్యవేక్షించేందుకు ఉపయోగపడతాయి. కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో సైనికుల రవాణా, వివిధ ఆపరేషన్ల నిర్వహణకు హై మొబిలిటీ వాహనాలు కీలకంగా ఉంటాయి.
మైన్లను వేగంగా ఏర్పాటు చేసేందుకు సెల్ఫ్ ప్రొపెల్డ్ మెకానికల్ మైన్ లేయర్లు ఉపయోగపడతాయి.
వివరాలు
నేవీకి అధునాతన రాడార్లు, దేశీయ గ్యాస్ టర్బైన్లు
యుద్ధ సమయంలో నదులు, ఇతర అడ్డంకులను సైనిక దళాలు దాటేందుకు 'సర్వత్ర బ్రిడ్జ్ సిస్టమ్' దోహదపడుతుంది.
అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లను ఆర్మీతో పాటు ఎయిర్ఫోర్స్ అవసరాలకు కూడా విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ట్రాల్ ట్యాంకులు కూడా సైనిక సామర్థ్యాన్ని పెంచే కీలక పరికరాల జాబితాలో ఉన్నాయి.
భారత నౌకాదళం కోసం 'అరుద్ర' రాడార్ల కొనుగోలుతో పాటు స్వదేశీ సాంకేతికత ఆధారంగా మెరైన్ గ్యాస్ టర్బైన్ల రూపకల్పన,అభివృద్ధి,సేకరణ ప్రతిపాదనలకు కూడా డీఏసీ అనుమతి ఇచ్చింది.
నావల్ ఎయిర్ స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న పాత రాడార్ల స్థానంలో అరుద్ర రాడార్లను ఏర్పాటు చేయనున్నారు.
యుద్ధనౌకలకు అవసరమైన చోదక వ్యవస్థలో మెరైన్ గ్యాస్ టర్బైన్లు కీలక పాత్ర పోషిస్తాయి.
వివరాలు
వైమానిక దళానికీ ఆధునిక వ్యవస్థలు
వీటిని దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసి తయారు చేయడం వల్ల భవిష్యత్తులో విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
భారత వాయుసేనకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది.
ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్ల సామర్థ్యాన్ని పెంచే చర్యలతో పాటు గ్రౌండ్ బేస్డ్ మల్టీ పర్పస్ జామర్లు, డిఫెన్స్ ఫోర్సెస్ సెక్యూర్ యాక్సెస్ కార్డ్ (డీఈఎఫ్ఎసీఏసీ) వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
శత్రుదేశాల రాడార్ల కార్యకలాపాలను అడ్డుకునే సామర్థ్యం గ్రౌండ్ బేస్డ్ మల్టీ పర్పస్ జామర్లకు ఉంటుంది. మరోవైపు ఆర్ఎఫ్ఐడీ సాంకేతికత ఆధారంగా పనిచేసే స్మార్ట్ కార్డుల ద్వారా డీఈఎఫ్ఎసీఏసీ వ్యవస్థను అమలు చేయనున్నారు.
వివరాలు
వైమానిక దళానికీ ఆధునిక వ్యవస్థలు
దీంతో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు గుర్తింపు కార్డుల స్థానంలో మరింత పటిష్ఠమైన, సురక్షితమైన గుర్తింపు వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
మొత్తంగా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ మూడు విభాగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ఆధునిక ఆయుధాలు, వాహనాలు, రాడార్లు, హెలికాప్టర్లు, జామింగ్ వ్యవస్థలు, సురక్షిత గుర్తింపు సాంకేతికతలను సమకూర్చుకునేందుకు తాజా ఆమోదాలు మార్గం సుగమం చేశాయి.
ముఖ్యంగా దాదాపు 98 శాతం కొనుగోళ్లు దేశీయ పరిశ్రమల నుంచే చేపట్టనుండటం రక్షణ రంగంలో స్వావలంబనకు మరింత బలం చేకూర్చనుంది.