Loading...
NEET protest: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. 'నీట్' నిరసనకారులపై కేసుల క్లోజ్
ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. 'నీట్' నిరసనకారులపై కేసుల క్లోజ్

NEET protest: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. 'నీట్' నిరసనకారులపై కేసుల క్లోజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
06:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్ (NEET UG) పరీక్షలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు దిల్లీ ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను మూసివేయాలని నిర్ణయించడంతో పాటు, విద్యార్థులపై ఎలాంటి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఐఏఎస్) సంతోష్ డి. వైద్య గురువారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ఆమోదంతో ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిపారు.

వివరాలు 

నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తించదు 

ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, నీట్ నిరసనల్లో పాల్గొన్న వారిపై ఢిల్లీ పోలీసు పరిధిలోని ఏ అధికారి కూడా ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.

అయితే ఇప్పటికే నేర చరిత్ర (Criminal Antecedents) ఉన్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అదేవిధంగా, నీట్ ఆందోళనల సందర్భంగా ఎవరైనా అరెస్టు అయ్యి ఉండినా లేదా అదుపులోకి తీసుకుని ఉండినా, ఆ కేసులను తక్షణమే సమీక్షించి వీలైనంత త్వరగా వారిని విడుదల చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.

వివరాలు 

మొత్తం 13 కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ఇక నిరసనకారులపై ఎలాంటి తదుపరి చర్యలు కొనసాగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని కేసులను భవిష్యత్తులో ఎలాంటి విచారణలు చేపట్టకుండా పూర్తిగా క్లోజ్ (Closed) చేసినట్లుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

నీట్ పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో జూలై 29 సాయంత్రం 6 గంటల వరకు ఢిల్లీ పోలీసులు మొత్తం 13 కేసులు నమోదు చేశారు.

తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఆ కేసుల భయం నుంచి విద్యార్థులు, నిరసనకారులకు భారీ ఊరట లభించింది.

ADVERTISEMENT