Bomb Threat : ఢిల్లీ హైకోర్టు,విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఆగస్టు 15 వేడుకలకు ముందు ఢిల్లీ హైకోర్టుతో పాటు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తాజా నివేదికల ప్రకారం, హైకోర్టు, ఐజీఐ విమానాశ్రయం సహా పలు ప్రాంతాలకు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు వచ్చిన బెదిరింపు ఇమెయిల్పై పోలీసులకు సమాచారం అందించగా, భద్రతా సిబ్బంది హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్లతో కలిసి కోర్టు ఆవరణ మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
వివరాలు
ఢిల్లీ వ్యాప్తంగా భారీ భద్రత
ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు కనిపించలేదని, బెదిరింపు నకిలీదిగా అనిపిస్తోందని హైకోర్టు వర్గాలు వెల్లడించాయి.
ఇదే సమయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో అక్కడ భద్రతా చర్యలను మరింత పెంచారు.
విమానాశ్రయ ప్రాంగణంలో అధికారులు, భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ముఖ్యంగా ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ నగరవ్యాప్తంగా ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజాగా వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో సున్నితమైన ప్రభుత్వ భవనాలు,విమానాశ్రయాలు,రైల్వే స్టేషన్లు,రద్దీ ప్రాంతాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ప్రవేశ,నిష్క్రమణ మార్గాల వద్ద తనిఖీలను తీవ్రతరం చేసినట్లు పోలీసులు తెలిపారు.