Water: ఎండిపోతున్న చెరువులు.. పొడిబారుతున్న పొలాలు
ఈ వార్తాకథనం ఏంటి
చెరువు అంటే గ్రామానికి ఆధారం. సాగునీటిని అందించడంతోపాటు పశుపక్ష్యాదుల అవసరాలు తీర్చడంలో, భూగర్భ జలమట్టాలను కాపాడటంలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయి. రాష్ట్రంలోని 21,500 నోటిఫైడ్ చెరువుల్లో ఆగస్టు 20 నాటికి కేవలం 1,354 మాత్రమే పూర్తిగా నిండాయి. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 253.80 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ చెరువుల్లో ప్రస్తుతం 95.49 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే చెరువుల్లో 37.6 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల చెరువులు కలిపి 34,307 ఉండగా.. వాటి పరిధిలో 24.33 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
వివరాలు
పొడిబారుతున్న పొలాలు
ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం ఒక కారణమైతే.. సాధారణంగా చిన్నపాటి వర్షాలతోనే నిండే చెరువుల్లోనూ ఈసారి సగం కూడా నీరు చేరలేదు.
వాగులు, వంకల ద్వారా చెరువులకు చేరే వరద ప్రవాహాలు కూడా ఈ ఏడాది గణనీయంగా తగ్గిపోయాయి.
ప్రాజెక్టులు నిండితే వాటి కాలువల ద్వారా చెరువులను నింపే అవకాశం ఉండేది. కానీ ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆశించిన విధంగా లేకపోవడంతో చివరకు నిరాశే మిగిలింది.
వివరాలు
కృష్ణా బేసిన్ పరిధిలో పరిస్థితి ఇలా ఉంది
జోగులాంబ గద్వాల జిల్లాలో 105 చెరువులు ఉండగా కేవలం 2 మాత్రమే పూర్తిగా నిండాయి.
వనపర్తిలో 222 చెరువులకు 2 మాత్రమే నిండాయి.
నారాయణపేటలో 198కి 3, నాగర్కర్నూల్లో 447కి 6 చెరువులు నిండాయి.
మహబూబ్నగర్లో 331 చెరువులకు 8, వికారాబాద్లో 310కి 8, మేడ్చల్లో 310కి 5 నిండాయి.
రంగారెడ్డి జిల్లాలో 221 చెరువులకు 7, సంగారెడ్డిలో 382కి 23 చెరువులు పూర్తిగా నిండాయి.
సూర్యాపేట జిల్లాలో 410 చెరువులకు 23 మాత్రమే నిండాయి.
వివరాలు
గోదావరి బేసిన్ పరిధిలో పరిస్థితి
మహబూబాబాద్ జిల్లాలో 525 చెరువులు ఉండగా కేవలం 6 మాత్రమే నిండాయి.
ఆదిలాబాద్లో 275కి 13, జనగామలో 235కి 15 చెరువులు నిండాయి.
భద్రాద్రి కొత్తగూడెంలో 518కి 19, పెద్దపల్లిలో 1,100కి 98 నిండాయి.
వరంగల్ గ్రామీణ జిల్లాలో 351 చెరువులకు 13, కుమురం భీం ఆసిఫాబాద్లో 329కి 11 నిండాయి.
ములుగు జిల్లాలో 313 చెరువులకు 11, జయశంకర్ భూపాలపల్లిలో 367కి 25 నిండాయి.
ఖమ్మం జిల్లాలో 499 చెరువులకు 26, మంచిర్యాల జిల్లాలో 885 చెరువులకు 53 మాత్రమే పూర్తిగా నిండాయి.
వివరాలు
1975 తర్వాత మళ్లీ ఎండిన బయ్యారం చెరువు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని బయ్యారం చెరువు పరిస్థితి ఈ ఏడాది కరువు తీవ్రతకు అద్దం పడుతోంది.
సుమారు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ చెరువు 1975 తర్వాత ఇప్పుడు మాత్రమే పూర్తిగా ఎండిపోయింది.
రాష్ట్రంలో ముందుగా అలుగు పోసే చెరువుగా దీనికి పేరుంది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ చివరి వారం లేదా జులై రెండో వారం నాటికే ఈ చెరువు నిండేది.
కానీ ఈసారి వర్షాలు లేకపోవడంతో నీరు అడుగంటిపోయింది. బయ్యారం మండలంలోని 10 వేల ఎకరాల సాగు ఈ చెరువుపైనే ఆధారపడి ఉంది.
అలాగే బయ్యారం చెరువు నుంచి అలుగు నీటితో నిండే గార్ల చెరువు కింద మరో 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.