Rahul Gandhi: E20 పెట్రోల్తో కార్లు, స్కూటర్లు, జీవితాలు నాశనం.. ఇంధన విధానంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
E20 పెట్రోల్ విధానంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశం ప్రజలకు సంబంధించిన చాలా ముఖ్యమైన సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా వాహనదారులపై ఆర్థిక భారం పెరుగుతోందని ఆరోపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ "భారీ స్థాయిలో" లేవనెత్తుతుందని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియోలో రాహుల్ గాంధీ తెలిపారు. E20 పెట్రోల్ కారణంగా కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రభావం పడుతోందని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆరోపించారు.
వివరాలు
రాహుల్ ఏమన్నారంటే..
ఈ వ్యవహారంలో ఏదో ఒక చిన్న సమస్య మాత్రమే లేదని చెప్పేందుకు ఆయన హిందీలోని "దాల్ మే కుచ్ కాలా హై, మగర్ యహాన్ పూరీ దాల్ హీ కాలీ హై" అనే సామెతను ప్రస్తావించారు.
అంటే.. "పప్పులో ఏదో నల్లగా ఉంది అనుకునే పరిస్థితి కాదు.. పప్పంతా నల్లగానే ఉంది" అని ఆయన వ్యాఖ్యల సారాంశం. "E20 విషయంలో సమస్య చాలా పెద్దది.
అందుకే కాంగ్రెస్ ఈ అంశాన్ని భారీ స్థాయిలో లేవనెత్తుతుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించడంపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఇథనాల్ కలపని సాధారణ పెట్రోల్..
E20 పెట్రోల్ అమలును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా వ్యతిరేకిస్తోంది. ఈ వారం ప్రారంభంలో AAP నేత అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు పార్టీ నాయకులు E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
E20 పెట్రోల్కు వ్యతిరేకంగా సేకరించిన 2.3 లక్షలకు పైగా వినతిపత్రాలను ప్రధానికి సమర్పించేందుకు వారు ప్రయత్నించగా.. ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో వాహనదారులకు ఇథనాల్ కలపని సాధారణ పెట్రోల్ లేదా E20 పెట్రోల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది.
వివరాలు
ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఆరోపణలు..
అంతేకాకుండా E20 పెట్రోల్ ధరను తగ్గించాలని కోరుతోంది. ఇథనాల్కు తక్కువ కెలోరిఫిక్ విలువ ఉండటంతో ఇంధన సామర్థ్యం, అంటే మైలేజీపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ పార్టీ వాదిస్తోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం, చమురు మార్కెటింగ్ సంస్థలు మాత్రం E20 పెట్రోల్ నిర్దేశిత ఇంధన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని చెబుతున్నాయి.
ఇందుకు సంబంధించి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నామని వెల్లడించాయి.
తక్కువ ఇథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా తయారైన పాత వాహనాల్లో మైలేజీ కొంత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం కూడా అంగీకరించింది.
అయితే పెద్ద ఎత్తున ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలను మాత్రం కేంద్రం తోసిపుచ్చింది.