Jayalalitha: పన్ను బకాయిల ఎఫెక్ట్.. దివంగత సీఎం జయలలిత ఇల్లు వేలానికి?
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం 'వేద నిలయం'ను వేలానికి పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. జయలలితకు సంబంధించిన భారీగా పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను, ఆస్తి పన్ను బకాయిలను రికవరీ చేయడమే ఇందుకు కారణంగా మారింది. మొత్తం మీద ఆమె చెల్లించాల్సిన పన్నులు రూ.13.69 కోట్లుగా ఉన్నాయని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. అయితే ఈ మొత్తాన్ని ఇప్పటివరకు ఆమె చట్టపరమైన వారసులు చెల్లించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వడ్డీతో సహా రూ.13.69 కోట్లను చెల్లించకపోతే 'వేద నిలయం'ను వేలానికి వేయాల్సి వస్తుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలియజేశారు. జయలలిత 1991-92 నుంచి 2006-07 మధ్య కాలంలో ఆదాయ పన్ను చెల్లించలేదన్నారు.
Details
చట్టపరమైన వారసులుగా మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్
అలాగే 1992-93 నుంచి 2015-16వరకు ఆస్తి పన్ను కూడా కట్టలేదని అధికారులు కోర్టుకు వివరించారు. పెండింగ్లో ఉన్న మొత్తం పన్నును వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మద్రాస్ హైకోర్టు 2020 మే 27న ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్లను చట్టపరమైన వారసులుగా ప్రకటించింది. ఈ నిర్ణయం తర్వాత జయలలితపై ఉన్న పన్ను బకాయిలను వారి నుంచి రికవరీ చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా 2025 జులై 13న వారసులకు నోటీసులు పంపింది. అయితే ఈ చర్యను వ్యతిరేకిస్తూ జయలలిత మేనకోడలు దీప 2025 ఆగస్టు 4న మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈకేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.