
PECET: రాష్ట్రంలో పీఈసెట్లో 94.96 శాతం మంది ఉత్తీర్ణత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ),డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు ప్రకటించారు.
ఈ పరీక్షలో మొత్తం హాజరైన అభ్యర్థులలో 94.96 శాతం మంది అర్హత సాధించారు.
పరీక్షలో భాగంగా వివిధ క్రీడల పోటీలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 1,767 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 1,678 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పీఈసెట్ ఫలితాలను మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడుదల చేశారు.
ఫలితాల సీడీని మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి,పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ శ్రీనివాస్, పీఈసెట్ కన్వీనర్ దిలీప్ సంయుక్తంగా ఆవిష్కరించారు.
వివరాలు
బీపీఈడీ కోర్సుకు 1,660 సీట్లు
ఈ సందర్భంగా ఛైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, బీపీఈడీ కోర్సులో 1,252 మంది, డీపీఈడీ కోర్సులో 426 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు.
డీపీఈడీ కోర్సుకు రాష్ట్రవ్యాప్తంగా 300 సీట్లు, బీపీఈడీ కోర్సుకు 1,660 సీట్లు ఉన్నట్లు వెల్లడించారు.
వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ, బీపీఈడీలో ములుగు జిల్లా రోహీర్ ప్రాంతానికి చెందిన ఎస్. జ్యోతిర్మయి ప్రథమ ర్యాంకు సాధించగా, డీపీఈడీలో కొత్తగూడెం జిల్లా కె. వీరభద్రపురం చెందిన తుస్రా సీతామహాలక్ష్మి మొదటి ర్యాంకు సాధించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యామండలి ఉపాధ్యక్షుడు ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, పాలమూరు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి. రమేశ్బాబు, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన ఆచార్యులు లక్ష్మీకాంత్ రాథోడ్, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.