Page Loader
EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే!
టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే!

EAPCET: టాప్‌ ర్యాంకులు సాధించినా.. స్థానికేతర విద్యార్థులకు ఎఫ్‌సెట్‌లో చోటు కష్టమే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2025
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఎఫ్‌సెట్‌ (ఇంజినీరింగ్‌ విభాగం)లో పలువురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించినా వారికి ఈసారి రాష్ట్రంలోని కన్వీనర్‌ కోటాలో సీట్లు దక్కే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న పదేళ్ల గడువు పూర్తవడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు కన్వీనర్‌ కోటాలో 85శాతం స్థానికులకు, 15శాతం స్థానికేతరులకు సీట్లు కేటాయించనున్నారు. కానీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు స్థానికేతర కోటాలో కూడా తెలంగాణ మూలాలు ఉన్న విద్యార్థులకే ప్రాధాన్యం ఇస్తామని తేల్చి చెప్పింది.

Details

కళాశాలల్లో కట్‌ఆఫ్‌ ర్యాంకులు మరింత పెరిగే అవకాశం

అంటే, తల్లిదండ్రులెవ్వరైనా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి, విద్యార్థికి రాష్ట్రంలో స్థానిక అర్హత లేకపోయినప్పటికీ ఆయనకు 15% కోటాలో సీటు దక్కే అవకాశం ఉంటుంది. గత పదేళ్లలో ఈ 15% నాన్‌-లోకల్‌ కోటా ద్వారా ఏటా 3,500-4,000 మంది ఏపీ విద్యార్థులు తెలంగాణ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేవారు. అయితే ఈసారి ఆ అవకాశాన్ని కోల్పోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలిగే సూచనలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రముఖ కళాశాలల్లో కట్‌ఆఫ్‌ ర్యాంకులు మరింత పెరిగే అవకాశమూ ఉంది.

Details

హైదరాబాద్‌లో ఇంటర్‌ చదివినా లాభం లేదు 

తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో సీటు పొందాలంటే విద్యార్థులు కనీసం 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలి. ఉదాహరణకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు లేదా 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివినవారిని స్థానికులుగా పరిగణిస్తారు. కానీ ఏపీకి చెందిన అనేక మంది విద్యార్థులు పదో తరగతి వరకూ సొంత రాష్ట్రంలో చదివి, ఇంటర్‌ కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ కళాశాలలకు వస్తున్నారు. వారు తెలంగాణలో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే విద్యనభ్యసిస్తారు కాబట్టి స్థానికేతరులుగానే పరిగణించబడుతున్నారు. ఫలితంగా కన్వీనర్‌ కోటాలో సీటు దక్కడం అసాధ్యం అవుతోంది.

Details

టాప్‌ ర్యాంకర్లను లెక్కపెట్టొచ్చు! 

విజయవాడ వంటి ప్రాంతాల్లోని కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుతున్న వందలాది విద్యార్థులు సరిహద్దు ప్రాంతాల్లోని కోదాడ, సత్తుపల్లి వంటి కేంద్రాల్లో ఎఫ్‌సెట్‌ రాశారు. వారు ఇతర బోర్డుల నుంచి అని దరఖాస్తు చేసి పరీక్ష రాసినప్పటికీ, వారి అర్హతల కారణంగా ప్రవేశానికి అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. నిపుణుల మాటల ప్రకారం, ఈ విద్యార్థుల ఉద్దేశం టాప్‌ ర్యాంకు సాధించి జేఈఈ వంటి పరీక్షల కోసం ప్రాక్టీస్ చేయడమేనని చెబుతున్నారు.

Details

టాప్‌ ర్యాంకులు సాధించినా చేరడం తక్కువే 

ఇంజినీరింగ్‌ ఎఫ్‌సెట్‌ టాప్‌ ర్యాంకర్లు చాలామంది జేఈఈ మెయిన్‌లోనూ మెరుగైన ర్యాంకులు సాధించారు. ఉదాహరణకు రెండో ర్యాంకర్‌ రామచరణ్‌ రెడ్డికి జేఈఈ మెయిన్‌లో 53వ ర్యాంకు వచ్చిందీ, మూడో ర్యాంకర్‌ హేమసాయి సూర్యకార్తీక్‌కు 75వ ర్యాంకు. వీరంతా ఈ నెల 18న జరిగే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నారు. దీనిని బట్టి వారు ఐఐటీలు లేదా టాప్‌ ఎన్‌ఐటీల్లో చేరతారని అర్థమవుతుంది. టాప్‌ ర్యాంకర్లలో తెలంగాణకు చెందిన విద్యార్థులు సైతం రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరే వారు చాలా తక్కువమంది మాత్రమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.