Fertilizers: ఎరువుల ధరల మోత.. సాగు ఖర్చులు పెరిగి రైతులపై పెనుభారం
ఈ వార్తాకథనం ఏంటి
ఎరువుల ధరల పెరుగుదలతో రైతులపై సాగు భారం రోజురోజుకూ పెరుగుతోంది. నెల రోజుల క్రితం రూ.1,500కు లభించిన 45 కిలోల 20:20:0:13 ఎరువు బస్తా ప్రస్తుతం రూ.2,150కు చేరింది. అంటే ఒక్కో బస్తాపై రూ.650 అదనపు భారం పడుతోంది. ఎకరానికి సగటున మూడు బస్తాలు వినియోగించే రైతు అదనంగా రూ.1,950 చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు వంటి వ్యవసాయ యంత్రాల అద్దెలు భారీగా పెరిగాయి. మరోవైపు విత్తనాలు, కూలీల ఖర్చులు కూడా అధికమయ్యాయి. ఇప్పుడు ఎరువుల ధరలు కూడా ఒక్కో బస్తాపై రూ.300 నుంచి రూ.600 వరకు పెరగడంతో పంటల సాగు ఎలా కొనసాగించాలంటూ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
vivaralu
ముడి పదార్థాల ఖర్చులే కారణమంటున్న కంపెనీలు
అంతేకాక, అవసరమైన ఎరువులు కొనాలంటే ఇతర గుళికలు లేదా అదనపు ఎరువులు కూడా తప్పనిసరిగా కొనాలని కొందరు వ్యాపారులు షరతులు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రాయితీ ధరకు లభించాల్సిన డీఏపీ అనేక ప్రాంతాల్లో అందుబాటులో లేకపోగా,యూరియా సరఫరా కూడా సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు,ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతి వ్యయం పెరగడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని ఎరువుల తయారీ సంస్థలు చెబుతున్నాయి.
అయితే ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న కొందరు డీలర్లు పాత నిల్వలను కూడా కొత్త ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు
జిల్లాల్లో అధిక ధరల వసూళ్లు
కేంద్ర ప్రభుత్వం రాయితీపై డీఏపీ బస్తాను రూ.1,350కు, యూరియాను రూ.266కు అందిస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో డీఏపీ అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడలోని ఓ ఎరువుల దుకాణంలో అనంతగిరి మండలానికి చెందిన రైతు ఇటీవల 12 బస్తాల డీఏపీ కొనుగోలు చేశారు.
ఒక్కో బస్తాపై ఎమ్మార్పీ కంటే రూ.320 అదనంగా వసూలు చేయడంతో ఆయనపై మొత్తం రూ.3,840 అదనపు భారం పడింది.
అదే జిల్లాలోని తిరుమలగిరి మండలంలో ఓ వ్యాపారి ఒక్కో డీఏపీ బస్తాపై రూ.310 అదనంగా వసూలు చేయడంతో పాటు, గుళికలు, ఇతర ఎరువులు కూడా కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
వివరాలు
ఒక్కో డీఏపీ బస్తా రూ.1,900కు విక్రయం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీఏపీ నిల్వలు తగ్గిపోవడంతో పలుచోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
నాగర్కర్నూల్కు చెందిన ఓ డీలర్ ఒక్కో డీఏపీ బస్తాను రూ.1,900కు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఇక కాంప్లెక్స్ ఎరువుల విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మార్పీ రూ.1,450గా ఉన్న పాత స్టాక్ను ప్రస్తుతం రూ.1,800కు విక్రయిస్తున్నారు.
తాజాగా రూ.1,800 ఎమ్మార్పీతో వచ్చిన కొత్త బస్తాలను కూడా రూ.2,150కు అమ్ముతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
వివరాలు
యూరియా బుకింగ్లో అవకతవకల ఆరోపణలు
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో యూరియా బుకింగ్ ప్రక్రియలో కూడా అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు మండల వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాల యజమానులు,స్థానిక నాయకులకు ముందుగానే సమాచారం ఇచ్చి అధికారిక సమయానికి ముందే బుకింగ్ను ప్రారంభిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
వారు అవసరమైన మేరకు బుకింగ్ పూర్తిచేసుకున్న తర్వాత తాత్కాలికంగా బుకింగ్ నిలిపివేసి, నిర్ణయించిన సమయానికి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు.
వివరాలు
యూరియా బుకింగ్లో అవకతవకల ఆరోపణలు
ఈలోపు ఆయా కేంద్రాలకు కేటాయించిన యూరియా నిల్వల్లో ఎక్కువ భాగం పూర్తవుతోంది.
మిగిలిన కొద్దిపాటి సంచులను బుక్ చేసుకునేందుకు రైతులు ప్రయత్నించే సరికి అవి సెకన్ల వ్యవధిలోనే పూర్తిగా అయిపోతున్నాయని వాపోతున్నారు.
ముఖ్యంగా ఉమ్మడి సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓ ఎరువుల డీలర్ రైతులకు అందాల్సిన 6 వేలకుపైగా యూరియా సంచులను ఇతరులకు విక్రయించిన ఘటనను అధికారులు గుర్తించినట్లు సమాచారం.