BCI: బీసీఐలో ఆర్థిక అవకతవకలు.. రూ.150 కోట్ల బదిలీ.. ఛైర్మన్ మిశ్రపై సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
నల్సార్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ నిర్ణయంతో ఇటీవల వార్తల్లో నిలిచిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్కుమార్ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో బీసీఐలో ఆర్థిక అవకతవకలు, అనుమానాస్పద నియామకాలు జరిగాయని కౌన్సిల్ కో-ఛైర్మన్ వై.ఆర్. సదాశివరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ అనుమతి లేకుండానే మిశ్ర బంధువులకు నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు. అధికారాలను దుర్వినియోగం చేశారంటూ 15 రోజుల్లోగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని బీసీఐని కోరారు.
వివరాలు
ప్రైవేట్ ట్రస్ట్కు రూ.150 కోట్ల బదిలీ?
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ట్రస్ట్ కార్యకలాపాలను మనన్కుమార్ మిశ్ర అడ్డుకున్నారని సదాశివరెడ్డి ఆరోపించారు.
దాని స్థానంలో 2020లో 'బీసీఐ ట్రస్ట్ పెరల్ ఫస్ట్' పేరుతో కొత్త ట్రస్ట్ను నమోదు చేశారని పేర్కొన్నారు. బీసీఐ నిధుల నుంచి రూ.150 కోట్లను ఈ ట్రస్ట్కు బదిలీ చేసేందుకు తీర్మానం ప్రవేశపెట్టారని ఆరోపించారు.
అంతేకాకుండా, ట్రస్ట్కు విరాళాలు ఇవ్వాలని.. బీసీఐ నుంచి గుర్తింపు, పునరుద్ధరణ కోరే లా కళాశాలలను డిమాండ్ చేసేవారని సదాశివరెడ్డి ఆరోపించారు.
చట్టబద్ధమైన నిధులను ప్రైవేట్ ట్రస్ట్కు బదిలీ చేశారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.
వివరాలు
నియామకాలపైనా ఆరోపణలు
బీసీఐ సిబ్బందిలో ఎక్కువ మంది మనన్కుమార్ మిశ్ర కుటుంబ సభ్యులు లేదా ఆయనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నవారేనని సదాశివరెడ్డి ఆరోపించారు.
వారి నియామకాలను సమర్థించే ఎంపిక కమిటీలు, మెరిట్ జాబితాలకు సంబంధించిన రికార్డులు కౌన్సిల్ వద్ద లేవని పేర్కొన్నారు.
నిధులు, నియామకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.