India's Uneven Monsoon: దేశంలో రుతుపవనాల వింత పోకడ.. ఒకచోట కుండపోత, మరోచోట ఉక్కపోత!
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో నైరుతి రుతుపవనాలు తొలి దశలో బలహీనంగా ప్రారంభమైనప్పటికీ, జూలైలో కురిసిన వర్షాలతో కొంత మేర పుంజుకున్నాయి. అయితే ఈ మెరుగుదల దేశవ్యాప్తంగా ఒకేలా కనిపించలేదు. పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా, వాయవ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్పంలోని పలు రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. దీంతో ఈ ఏడాది రుతుపవనాల పంపిణీ మరింత అసమానంగా మారిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాల ప్రకారం,జూన్ ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా సాధారణంగా 446.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా,ఇప్పటివరకు 395.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.
వివరాలు
సీజన్ మొత్తం మీద 11 శాతం వర్షపాతం లోటు
దీంతో సీజన్ మొత్తం మీద 11 శాతం వర్షపాతం లోటు కొనసాగుతోంది. జూలైలో వర్షాలు కొంత మెరుగుపడినా, అనేక రాష్ట్రాలు ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేకపోయాయి.
తాజా ఉపగ్రహ చిత్రాల్లో కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో గుజరాత్తో పాటు పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని విస్తార ప్రాంతాలు మాత్రం మేఘాలు లేకుండా కనిపించడం అక్కడ రుతుపవనాల బలహీనతను సూచిస్తోంది.
వివరాలు
వర్షాలు ఎందుకు అసమానంగా కురుస్తున్నాయి?
దీనికి ప్రధాన కారణంగా రుతుపవన ద్రోణి (Monsoon Trough) స్థానంలో చోటుచేసుకుంటున్న మార్పులను వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఈ అల్పపీడన మండలం దేశంలోని వివిధ ప్రాంతాలకు సమానంగా వర్షాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ఈ ఏడాది అది తరచూ తన సాధారణ స్థానాన్ని విడిచి పశ్చిమ, మధ్య భారతదేశం వైపు మళ్లుతోంది.
దీంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తుండగా, ఉత్తర, దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాలు దీర్ఘకాలం పొడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి.
అదే సమయంలో ఏర్పడుతున్న అల్పపీడన వ్యవస్థలు దేశమంతా విస్తరించి వర్షాలు కురిపించే బదులు, పరిమిత ప్రాంతాల్లోనే అత్యంత భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
వివరాలు
ఎల్నినో ప్రభావం కొనసాగుతోంది
అయితే రాబోయే రోజుల్లో రుతుపవన ద్రోణి మళ్లీ ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
దీంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే అవకాశముంది.
ఆగస్టు 3 నుంచి 5 మధ్య వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ,ఈ మార్పు క్రమంగా మాత్రమే కనిపిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది అసమాన వర్షాల వెనుక ఎల్నినో ప్రభావం కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్ర తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు నెలలో సాధారణ దీర్ఘకాల సగటుతో పోలిస్తే 94 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
ఆగస్టు,సెప్టెంబర్ నెలలను కలిపినా వర్షాలు సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
భారీ వర్షాలు పడుతున్నా జలాశయాలు ఎందుకు నిండడం లేదు?
ప్రస్తుతం మధ్యస్థాయి ఎల్నినో పరిస్థితులు కొనసాగుతున్నాయని,సెప్టెంబర్ నాటికి అవి మరింత బలపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దీంతో వర్షాల పంపిణీలో మరింత అసమానత కనిపించే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు.
జూలైలో మంచి వర్షాలు కురిసినా దేశంలోని ప్రధాన జలాశయాల నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరలేదు.
కేంద్ర జల సంఘం (CWC) తాజా బులెటిన్ ప్రకారం,జూలై చివరి నాటికి దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో 70.43 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది.
ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 36 శాతం తక్కువగా ఉండటమే కాకుండా సాధారణ స్థాయి కంటే కూడా తక్కువగా ఉంది. దక్షిణ భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.
వివరాలు
భారీ వర్షాలు పడుతున్నా జలాశయాలు ఎందుకు నిండడం లేదు?
కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని జలాశయాలు సాధారణ స్థాయికి చాలా దిగువన ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో నీటి నిల్వల లోటు ఎక్కువగా నమోదైంది.
వర్షాలు సమానంగా కురవకపోవడం వల్ల అనేక జలాశయాల పరివాహక ప్రాంతాలకు తగిన నీటి ప్రవాహం చేరడం లేదని కేంద్ర జల సంఘం వెల్లడించింది.
కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి భారీ వర్షాలు కురవడంతో నీరు వేగంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతోంది.
మరోవైపు సాగు, తాగునీరు, పరిశ్రమలు, జలవిద్యుత్ అవసరాల కోసం నీటి విడుదల కొనసాగుతుండటంతో నిల్వలు మరింత తగ్గుతున్నాయి.
వివరాలు
వ్యవసాయంపై ప్రభావం ఎలా ఉంటుంది?
జూన్లో వర్షాభావం కారణంగా ఆలస్యమైన ఖరీఫ్ పంటల సాగు, జూలైలో కురిసిన వర్షాలతో వేగం అందుకుంది.
అయితే ఆగస్టులో కూడా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా కొనసాగితే, వర్షాధార వ్యవసాయం చేసే ప్రాంతాల్లో పంటల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
దేశంలోని దాదాపు సగం వ్యవసాయ భూమి ఇప్పటికీ రుతుపవనాలపై ఆధారపడి ఉండటంతో, మొత్తం వర్షపాతం కంటే వర్షాల పంపిణీ సమానంగా ఉండటం మరింత కీలకంగా మారింది.
వివరాలు
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా వాతావరణ సంబంధిత ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం విడుదల చేసిన తాజా ద్రవ్య పరపతి విధాన ప్రకటనలో, అసమాన రుతుపవనాలు, ఎల్నినో ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ప్రాంతాల వినియోగ డిమాండ్పై ప్రభావం చూపే అవకాశముందని పేర్కొంది.
అయితే పంటల వైవిధ్యీకరణ, వాతావరణ మార్పులకు తట్టుకునే విత్తనాల వినియోగం, నీటి సంరక్షణ వంటి ప్రభుత్వ చర్యలు ఈ ప్రభావాన్ని కొంత మేర తగ్గించగలవని అభిప్రాయపడింది.
వివరాలు
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం
ప్రస్తుతం వాయవ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అసమాన వర్షాల ధోరణిలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల వర్షాభావం కొనసాగుతుండటం భవిష్యత్తులో దేశ జలవనరులు, వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.