
Hyderabad: దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఒక శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ 'డిజిటల్ ఇండియా' కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మొత్తం 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆగస్టు 8న రాజ్యసభలో అధికారికంగా వెల్లడించారు. రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్లలో టెలికాం సంస్థలు ఇప్పటికే 4జీ/5జీ సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులు ఈ నెట్వర్క్లను డేటా కనెక్టివిటీ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పారు. దీనికితోడు, ప్రయాణికుల సౌకర్యార్థం 6,115 స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించామని వివరించారు.
Details
'రైల్వైర్' పేరుతో సేవలు
రైల్టెల్ ఆధ్వర్యంలో 'రైల్వైర్' పేరుతో ఈ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత వైఫై సౌకర్యం లభించే ప్రధాన స్టేషన్లలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడతో పాటు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, బెంగళూరు (యశ్వంత్పుర్), అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్సర్, ఎర్నాకుళం, ప్రయాగ్రాజ్ వంటి అనేక ప్రముఖ స్టేషన్లు ఉన్నాయి. వైఫై సేవను ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ స్మార్ట్ఫోన్లో వైఫై ఆప్షన్ ఓపెన్ చేసి, 'రైల్వైర్' నెట్వర్క్ను ఎంచుకోవాలి. తర్వాత తమ మొబైల్ నంబర్ను నమోదు చేసి, ఫోన్కు వచ్చేOTPని ఎంటర్ చేస్తే ఉచిత ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఈసేవలతో స్టేషన్ ప్రాంగణంలో ఉన్నప్పుడు ప్రయాణికులు ఆన్లైన్ పనులు చేయడం, వీడియోలు వీక్షించడం వంటి కార్యకలాపాలు సులభంగా చేసుకోవచ్చు.