PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వివరాలను వెల్లడించారు. పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
వివరాలు
కొంత సమయం కావాలి
పీఆర్సీతో పాటు రెండు డీఏలు, ఒక సరెండర్ లీవ్ మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పోలీసులకు అదనంగా మరో సరెండర్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలు చేయడం, ఈహెచ్ఎస్ బకాయిలను ప్రతి నెలా ఒకటో తేదీన ట్రస్ట్కు చెల్లించడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు కూడా సీఎం హామీ ఇచ్చారని సూర్యనారాయణ వెల్లడించారు.
ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని తాము సీఎంను కోరినట్లు ఆయన తెలిపారు.
అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఐఆర్ (ఇంటరిమ్ రిలీఫ్) అంశంపై కొంత సమయం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరినట్లు సూర్యనారాయణ చెప్పారు.