
Heavy rains: ఏపీకి గుడ్ న్యూస్.. ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
రాయలసీమ ప్రాంతంలో వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాబోయే మూడు నెలల కోసం భారత వాతావరణ శాఖ (IMD) సానుకూల అంచనాలు ప్రకటించింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల సీజన్ సాధారణం కంటే ఎక్కువ వర్షాలు అందించనున్నట్లు పేర్కొంది.
Details
112 శాతం అధిక వర్షపాతం
అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలాన్ని ఈశాన్య రుతుపవనాల సీజన్గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లో దీర్ఘకాల సగటుతో పోలిస్తే 112శాతం అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశముందని IMDఅంచనా వేసింది. ముఖ్యంగా అక్టోబరు నెలలో వర్షపాతం 115శాతం వరకు చేరొచ్చని అధికారులు తెలిపారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలపై ఎక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. వాతావరణ నమూనాల అంచనాల ప్రకారం, అక్టోబరు 17 నుంచి 21వ తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశముంది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిన వెంటనే ఈశాన్యం కూడా కురిసే అవకాశం ఉందని తెలియడంతో, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.