Election Commission of India: చిన్న పార్టీలకు గుడ్ న్యూస్.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో ఈసీ మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక ఊరట కల్పించింది. ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుగా ఉమ్మడి గుర్తు కేటాయింపు నిబంధనలను సడలిస్తూ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తాజా మార్పుల ప్రకారం గత రెండు సాధారణ ఎన్నికల్లో ఏదైనా ఒకటిలో కనీసం 1 శాతం ఓట్లు సాధించిన పార్టీకి ఉమ్మడి గుర్తు పొందే అర్హత కల్పించింది. ఈ నేపథ్యంలో 'ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్లు, కేటాయింపు) ఉత్తర్వులు, 1968'లోని పేరాగ్రాఫ్ 10(బి)లో సవరణలు చేస్తూ మార్చి 28న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు
1శాతం ఓట్లు సాధించినప్పుడే ఉమ్మడి గుర్తు పొందే అర్హత
ఈ మార్పులతో గతంలో పోటీ చేసి 1 శాతం కంటే తక్కువ ఓట్లు పొందిన పార్టీలకు కూడా తాజా ఎన్నికల్లో ఉమ్మడి గుర్తు కేటాయించే అవకాశం లభించనుంది. ఇంతకుముందు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, పార్టీ చివరిసారిగా పోటీ చేసిన ఎన్నికలో కనీసం 1 శాతం ఓట్లు సాధించినప్పుడే ఉమ్మడి గుర్తు పొందే అర్హత ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని సడలించడం ద్వారా చిన్న పార్టీలకు ప్రయోజనం కలగనుంది. క్షేత్రస్థాయిలో ప్రజా మద్దతు కూడగడుతున్న చిన్న రాజకీయ పార్టీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
వివరాలు
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఈ నిబంధనలు అమలు
ఒక ఎన్నికలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ, తరువాతి ఎన్నికలో 1 శాతం ఓట్ల షేర్ అందుకోలేకపోయిన పార్టీలకు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సవరణలు చేసినట్లు స్పష్టం చేసింది. సవరించిన ఈ నిబంధనలు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఇకపై జరగబోయే అన్ని ఎన్నికలకు ఈ మార్పులు వర్తిస్తాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.