Kishan Reddy : తెలంగాణకు గుడ్న్యూస్.. త్వరలో ప్రారంభం కానున్న రీజినల్ రింగ్ రోడ్ పనులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో హైదరాబాద్ మరోసారి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా మాదాపూర్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)కి వెళ్లిన ప్రధాని, ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్చువల్ విధానంలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. సుమారు రూ.9,400 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు హాస్పిటల్ను కూడా ప్రారంభించారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలతరఫున ప్రధాని మోడీకి స్వాగతం తెలిపారు.
వివరాలు
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది
2014కు ముందు రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఎలా ఉండేదో, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ చొరవతో అవి ఎంతగా అభివృద్ధి చెందాయో ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను విమానాశ్రయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురానున్న రీజినల్ రింగ్ రోడ్ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. గతంలో ప్రధాని పర్యటనల సమయంలో అప్పటి ముఖ్యమంత్రులు హాజరుకాకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.