Jammalamadugu: గండికోట వేదికగా కళా సంబరాలు.. కళలతో కళకళలాడిన వేదిక
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న 'వారసత్వ ఉత్సవాలు' సోమవారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి. ప్రకృతి రమణీయత, చారిత్రక కట్టడాల నడుమ సాగిన కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకర్షించాయి. వేదికపై కళాకారులు ప్రదర్శించిన జానపద, శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. డప్పులు, కోలాటాలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో వేదిక కళకళలాడింది. రామ్ మిరియాల బృందం నిర్వహించిన 'మ్యూజికల్ నైట్ షో' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గండికోట లోయ, పెన్నానది పరిసరాల్లో ఏర్పాటు చేసిన సాహస క్రీడల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని చాటుకుంది.
వివరాలు
ఆకాశాన్నంటిన ఉత్సాహం
గండికోట వారసత్వ ఉత్సవాల్లో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చిన హెలికాప్టర్ రైడ్కు మంచి స్పందన లభిస్తోంది. తొలిసారిగా గండికోట సౌందర్యాన్ని ఆకాశం నుంచి వీక్షించే అవకాశం రావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గండికోట సహజ అందాలు, రాతితో నిర్మితమైన కట్టడాలు, చారిత్రక కోట దృశ్యాలను గగన మార్గంలో చూస్తూ సందర్శకులు అరుదైన అనుభూతిని పొందుతున్నారు. పెన్నా లోయపై సుమారు ఆరు నిమిషాల పాటు హెలికాప్టర్ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.3 వేలుగా నిర్వాహకులు ధర నిర్ణయించారు.