
Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. రోహిణి కార్తె ప్రారంభమైన వెంటనే ఎండలు తగ్గుతాయేమో అనుకున్న సమయానికే వరుణుడు విజృంభించాడు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై విస్తృతంగా వర్షాలు కురిశాయి.
ఎడతెరిపి లేకుండా పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో ఎండాకాలం ముగిసిపోయినట్టే ప్రజలు భావించారు.
కానీ ఆ ఆశలు ఎక్కువ కాలం నిలువలేకపోయాయి. గత నాలుగైదు రోజులుగా భానుడు మళ్లీ విజృంభిస్తూ ఉష్ణోగ్రతలను పెంచుతున్నాడు.
ప్రత్యేకంగా తెలంగాణ, కోస్తాంధ్రలో ఎండలు మళ్లీ ఉద్ధృతంగా తాకుతున్నాయి. ఉక్కపోత అధికమవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
నైరుతి రుతుపవనాల మందగమనమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని వాతావరణ శాఖ విశ్లేషించింది.
Details
పలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
పశ్చిమ దిశ నుంచి వచ్చే వేడి, పొడిగాలులు ఈ ప్రభావాన్ని మరింత పెంచుతున్నాయని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఈ పరిస్థితులు మరో ఐదు రోజులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
జూన్ 4 గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట
యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
Details
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలోని పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీచడంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే సూచనలు ఉన్నాయి.
నల్లగొండలో గరిష్ఠంగా 38.5 డిగ్రీలైతే, మహబూబ్నగర్లో కనిష్ఠంగా 32.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇక ఆంధ్రప్రదేశ్లోనూ రుతుపవనాల మందగమనం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వేసవి పరిస్థితులు కొనసాగుతున్నాయి.
నాలుగు రోజులుగా తీవ్ర ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా రుతుపవన కదలిక బలహీనంగా ఉండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.
Details
కోస్తాంధ్రలో పలు జిల్లాలో వేడి
ఈ ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణాన్ని మించి 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగాయి.
కోస్తాంధ్రలో పలు జిల్లాల్లో వేడి తీవ్రత అధికంగా ఉండగా, కొన్నిచోట్ల 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండల తీవ్రత మధ్యాహ్నం తరువాత వాతావరణం మారిపోతూ, కొన్ని చోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి.
జంగమహేశ్వరపురంలో నిన్న 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
రానున్న 2-3 రోజులు కోస్తాంధ్రలో అనేకచోట్ల 36 నుంచి 38 డిగ్రీల మధ్య, కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.