Heavy Rains: జమ్మూకశ్మీర్,ఉత్తరాఖండ్ను ముంచెత్తిన వర్షాలు.. నిలిచిపోయిన చార్ధామ్, అమర్నాథ్ యాత్రలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్,జమ్ముకశ్మీర్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. జమ్మూకశ్మీర్లోని పూంఛ్ జిల్లా లోరాన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఓ మట్టి ఇంటిపై పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిరంతర వర్షాల ప్రభావంతో పూంఛ్,రాజౌరీ జిల్లాల్లో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా,మరో ఏడుగురు గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి మృతుల సంఖ్య 23కు చేరింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నాలుగు జాతీయ రహదారులు సహా దాదాపు 150 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. పరిస్థితులు దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రహదారులు పూర్తిగా సురక్షితంగా మారిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
దేహ్రాదూన్, తెహ్రీ, హరిద్వార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
వాతావరణ శాఖ దేహ్రాదూన్, తెహ్రీ, హరిద్వార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదల ఉద్ధృతికి సరయూ నదిలో ఎనిమిదేళ్ల బాలుడు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు జమ్మూలోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది.
దీంతో అమర్నాథ్, వైష్ణోదేవి, శివ్ఖోరీ యాత్రలను వరుసగా రెండో రోజు కూడా అధికారులు నిలిపివేశారు.
యాత్రికులు బేస్ క్యాంప్లలోనే ఉండాలని సూచించారు. అలకనంద, మందాకినీ నదులు ప్రమాద స్థాయికి చేరువ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వివరాలు
అస్సాంలో వరదలు
ఇక అస్సాంలో వరదల పరిస్థితి మరింత విషమించింది. జోర్హాట్ జిల్లాలో వరద ప్రవాహంలో ఇద్దరు బాలికలు సహా నలుగురు కొట్టుకుపోయారు.
కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో మరో వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు.
పలు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు.
హెలికాప్టర్లు, పడవల సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరదల ప్రభావంతో అస్సాంలో రైలు సేవలు కూడా పలు మార్గాల్లో అంతరాయం ఎదుర్కొంటున్నాయి.