గద్దర్కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!
ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి. మధ్యాహ్నం 12గంటల వరకు ఎల్బీ స్టేడియంలో గద్దర్ పార్థీవ దేహాన్ని ప్రజలు, అభిమానులు, ప్రముఖల సందర్శన కోసం ఉంచుతారు. అనంతరం ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. గన్పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా గద్దర్ అంతిమ యాత్ర సాగనుంది. అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని కాసేపు ఆపే అవకాశం ఉంది. ట్యాంక్బండ్ మీదుగా అల్వాల్లోని గద్దర్ ఇంటివరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. గద్దర్ ఇంట్లో పార్ధీవ దేహాన్ని కాసేపు ఉంచి, అక్కడి నుంచి బోధి విద్యాలయం వద్ద ఆయనకు అంతిమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గద్దర్కు ప్రముఖుల నివాళి
ఎల్పీ స్టేడియంలో గద్దర్ పార్థీవ దేహాన్ని కడసారి చూసేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు, భారీస్థాయిలో జనం తరలివస్తున్నారు. మోహన్ బాబు, పరుచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు గద్దర్ పార్థీవ దేహాన్ని సందర్శించిన సినీ ప్రముఖుల్లో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్దర్కు నివాళులర్పించారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క గద్దర్ పార్థీవ దేహం వద్దే ఉన్నారు.