Loading...
Bollaram Arms Theft: మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో.. హనీట్రాప్‌ కోణంలోనూ దర్యాప్తు
మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో.. హనీట్రాప్‌ కోణంలోనూ దర్యాప్తు

Bollaram Arms Theft: మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో.. హనీట్రాప్‌ కోణంలోనూ దర్యాప్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. కేసు నమోదై 48 గంటలు గడిచినా దర్యాప్తులో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించకపోవడం పోలీసులు, సైనిక అధికారులను కలవరపెడుతోంది. చోరీకి గురైన ఆయుధాలు సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ప్రతి చిన్న ఆధారాన్నీ పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ముందుకు సాగుతున్నకొద్దీ ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడుతున్నాయి. దుండగులు ఏ ఆయుధాలను తీసుకెళ్లారో, వాటికి సరిపోయే తూటాలను కూడా ఎంపిక చేసుకుని చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇది యాదృచ్ఛికంగా జరిగిన చోరీ కాదని, పక్కా ప్రణాళికతోనే జరిగి ఉంటుందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

వివరాలు 

బాగా తెలిసిన వారి పనేనా?

అదే సమయంలో హనీట్రాప్‌ కోణం ఏమైనా ఉందా అనే దానిపైనా దృష్టి పెట్టారు.

ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఒకేసారి కాకుండా చాలాకాలంగా అవకాశం దొరికినప్పుడల్లా కొద్దికొద్దిగా తరలించి ఉండవచ్చన్న అనుమానమూ వ్యక్తమవుతోంది.

ఈ వ్యవహారాన్ని రక్షణ మంత్రిత్వశాఖ కూడా అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది.

రాత్రీపగలు తేడా లేకుండా 48 గంటలుగా పదుల సంఖ్యలో సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అయినప్పటికీ బుధవారం రాత్రి వరకు ఒక్క కీలక ఆధారం కూడా లభించలేదు.

అయితే విచారణలో కొన్ని ముఖ్యమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెజిమెంట్‌లోని ఆయుధాల నిల్వ కేంద్రం 'కోటె' నుంచి నాలుగు ఏకే 203 రైఫిళ్లు, ఏడు 9 ఎం.ఎం. పిస్తోళ్లు, ఒక ఇన్సాస్‌ రైఫిల్‌ కనిపించకుండా పోయాయి.

వివరాలు 

బాగా తెలిసిన వారి పనేనా?

ఈ ప్రాంతంలో ఇంకా అనేక రకాల ఆయుధాలు నిల్వ ఉన్నాయి.

ఆయుధాల నిల్వ ప్రాంతానికి సుమారు 50అడుగుల దూరంలో మందుగుండు సామగ్రిని ఉంచుతారు.

ప్రతి ఆయుధానికి ప్రత్యేకంగా సరిపోయే తూటాలు అక్కడ ఉంటాయి.

చోరీకి పాల్పడిన వ్యక్తులు తమకు కావాల్సిన ఆయుధాలకే సరిపోయే తూటాలను ఎంచుకుని తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

దీంతో దుండగులకు ఆయుధాల వివరాలపై మాత్రమే కాకుండా కోటె ఉన్న ప్రదేశం,అక్కడి భౌగోళిక పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై కూడా పూర్తి అవగాహన ఉండి ఉంటుందని భావిస్తున్నారు.

మద్రాస్‌ రెజిమెంట్‌లో పనిచేస్తున్న సిబ్బందిని అధికారులు పదేపదే ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు అనుమానించదగ్గ సమాచారం ఎవరి నుంచి కూడా లభించలేదని తెలుస్తోంది.

రెజిమెంట్‌కు వచ్చే అన్ని మార్గాలపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ADVERTISEMENT

వివరాలు 

చోరీ ఎప్పుడు జరిగిందనే దానిపైనా సందేహాలు

ఆయా రహదారుల్లో ఏర్పాటు చేసిన వందలాది సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

అనుమానాస్పద కదలికలు, వ్యక్తులు లేదా వాహనాలకు సంబంధించిన ఆధారాల కోసం జల్లెడ పడుతున్నా ఇప్పటివరకు అక్కడి నుంచి కూడా కీలకమైన క్లూ లభించలేదని సమాచారం.

సోమవారం ఉదయం 7.50 గంటల సమయంలో కోటెను తనిఖీ చేసినప్పుడు ఆయుధాలు, మందుగుండు సామగ్రి కనిపించలేదని గుర్తించినట్లు సైనిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే చోరీ ఖచ్చితంగా ఆ సమయంలోనే జరిగిందా అనే దానిపై దర్యాప్తు అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా అవకాశం దొరికినప్పుడల్లా కొద్దికొద్దిగా మందుగుండును బయటకు తరలించి, చివర్లో ఆయుధాలను చోరీ చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ వందల సంఖ్యలో తూటాలను లెక్కించడం సులభమైన పని కాదు.

ADVERTISEMENT

వివరాలు 

చోరీ ఎప్పుడు జరిగిందనే దానిపైనా సందేహాలు

అంతేకాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఆయుధాలు, మందుగుండు చోరీకి గురవుతాయని సిబ్బంది ఊహించి ఉండకపోవచ్చు.

ఈ కారణంగానే అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఆయుధాలు సాధారణంగా అందరికీ కనిపించే విధంగా ప్రత్యేక స్టాండ్లలో ఉంచుతారు.

వాటిలో ఏదైనా ఒక ఆయుధం లేకపోతే ఆ స్టాండ్‌లో ఖాళీ స్థలం స్పష్టంగా కనిపిస్తుంది.

దీంతో ఆయుధాలు చోరీ అయిన తర్వాతే తనిఖీ అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉండవచ్చని దర్యాప్తు బృందం అంచనా వేస్తోంది.

అదే సమయంలో తూటాలు కూడా కనిపించకపోవడంతో వాటి చోరీ విషయం కూడా అప్పుడే బయటపడి ఉండవచ్చని భావిస్తున్నారు.

వివరాలు 

రికార్డుల నిర్వహణపైనా ప్రశ్నలు

మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రికి సంబంధించిన నిల్వ రికార్డులను పరిశీలించిన పోలీసులు వాటి నిర్వహణలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ అంశం కూడా దర్యాప్తు అధికారుల అనుమానాలను మరింత బలపరుస్తోంది.

దుండగులు కోటె తలుపుకు వేసిన తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. తూటాలను భద్రపరిచిన పెట్టెలను కూడా ధ్వంసం చేశారు.

అయితే ఇంత జరిగినా సమీపంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎలాంటి శబ్దాలు వినిపించకపోవడం అధికారులకు అనుమానాలు కలిగిస్తోంది.

దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా, చోరీ జరిగిన రాత్రి భారీ వర్షం కురిసిందని, అందువల్ల తాళాలు, పెట్టెలు పగలగొట్టిన శబ్దాలు తమకు వినిపించలేదని వారు చెప్పినట్లు సమాచారం.

వివరాలు 

హనీట్రాప్‌ కోణంలోనూ విచారణ

మద్రాస్‌ రెజిమెంట్‌లో పనిచేస్తున్న వ్యక్తుల్లో ఎవరినైనా హనీట్రాప్‌లోకి దించి,వారి సహాయంతో ఆయుధాలను బయటకు తరలించారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

ఈ విషయాన్ని కేసు విచారణలో పాల్గొంటున్న ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది.

రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సామాజిక మాధ్యమాల ఖాతాలు,వారి మొబైల్‌ ఫోన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఒకవేళ హనీట్రాప్‌ ద్వారా ఈ చోరీకి ప్రణాళిక రచించినట్లు తేలితే,కేసు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.

ఎందుకంటే దీని వెనుక దేశవిద్రోహ శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

చోరీకి గురైన ఆయుధాలు అలాంటి వ్యక్తుల చేతుల్లోకి చేరితే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది.

అందుకే పోలీసులు, సైనిక అధికారులు ప్రతి కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT