Hostel Owner: నీట్ ప్రశ్నపత్రం లీక్.. బయటపెట్టిన సికార్ హాస్టల్ యజమాని
ఈ వార్తాకథనం ఏంటి
నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పరీక్ష జరగడానికి వారం రోజుల ముందే రాజస్థాన్కు చెందిన ఇద్దరు సోదరులు ఓ వైద్యుడి ద్వారా ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్టు సమాచారం. ఇదే సమయంలో ఈ లీకేజీ వ్యవహారం బయటపడటానికి సికార్కు చెందిన ఓ హాస్టల్ యజమాని కీలక పాత్ర పోషించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్లోని సికార్కు చెందిన ఓ విద్యార్థి ప్రస్తుతం కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు, మే 2 రాత్రి 11 గంటల సమయంలో అతడికి సికార్లో ఉన్న తన స్నేహితుడి నుంచి పీడీఎఫ్ రూపంలో ప్రశ్నపత్రం అందింది.
వివరాలు
108 ప్రశ్నలు ఒకే విధంగా..
'అంచనా ప్రశ్నపత్రం' పేరుతో వచ్చిన ఆ పత్రాన్ని విద్యార్థి తన తండ్రికి పంపించాడు. అతడి తండ్రి సికార్లో హాస్టల్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మరుసటి రోజు ఉదయం కుమారుడు పంపిన సందేశాన్ని చూసిన హాస్టల్ యజమాని అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే తనకు పరిచయమున్న ఓ రసాయన శాస్త్ర అధ్యాపకుడికి ఆ ప్రశ్నపత్రాన్ని చూపించాడు. అప్పటికే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రారంభమైంది. దీంతో అసలు పరీక్ష ప్రశ్నపత్రంతో ఆ 'అంచనా ప్రశ్నపత్రం'ను అధ్యాపకుడు పరిశీలించగా దాదాపు 108 ప్రశ్నలు ఒకే విధంగా ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
పోలీసులను ఆశ్రయించిన హాస్టల్ యజమాని, రసాయన శాస్త్ర అధ్యాపకుడు
తర్వాత జీవశాస్త్ర విభాగంలోని ప్రశ్నలను కూడా పరిశీలించగా, అందులోనూ చాలా ప్రశ్నలు సరిపోవడంతో ప్రశ్నపత్రం లీక్ జరిగి ఉండొచ్చన్న అనుమానం బలపడింది. దీంతో హాస్టల్ యజమాని, రసాయన శాస్త్ర అధ్యాపకుడు కలిసి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతోనే ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.